కోల్కతా: తెలంగణ యువ ఫుట్బాల్ ప్లేయర్ గుగులోత్ సౌమ్య అరుదైన ఘనత సాధించింది. భారత జాతీయ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న ఈ నిజామాబాద్ ప్లేయర్.. క్రొయేషియా క్లబ్ ‘డైనమో జాగ్రెబ్’తో ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. సౌమ్యతో పాటు జ్యోతి చౌహాన్కూ ఈ అవకాశం దక్కింది. ఇటీవల ముగిసిన భారత మహిళల లీగ్లో వీరిద్దరూ ఆకట్టుకున్నారు. దేశం తరఫున డైనమో జాగ్రెబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి ప్లేయర్లు వీళ్లే కావడం విశేషం. క్లబ్ ఫుట్బాల్లో 46 ట్రోఫీలు సాధించి దూసుకెళ్తున్న డైనమో టీమ్.. తమను ఎంపిక చేసుకోవడం ఆనందంగా ఉందని వీరిద్దరూ పేర్కొన్నారు.
ఈ అనుభూతి మాటల్లో చెప్పలేను. ఇంత గొప్ప అవకాశం రావడం ఆనందంగా ఉంది. డైనమోలాంటి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు వ్యక్తిగతంగానే కాకుండా.. భారత ఫుట్బాల్కు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నా వరకు వంద శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.
-గుగులోత్ సౌమ్య