క్వార్టర్స్కు దూసుకెళ్లిన తెలంగాణ బాక్సర్.. ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్
దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు శుభారంభం దక్కింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు జరుగుతున్న టోర్నీలో తొలి రోజు తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు) అదిరిపోయే పంచ్లతో విజయం సాధించాడు. సోమవారం జరిగిన మొదటి రౌండ్లో హుసామ్ 5-0తో మఖ్మూద్ సాబిర్ఖాన్ (కజకిస్థాన్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. బౌట్ ఆరంభం నుంచి పదునైన పంచ్లతో విరుచుకుపడిన హుసామ్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. సాబిర్ఖాన్ పైచేయి సాధించాలని ప్రయత్నించిన ప్రతీసారి కౌంటర్ ఎటాక్తో విజృంభించి సునాయాసంగా గెలుపొందాడు. అయితే తొలి రౌండ్లో చక్కటి విజయాన్నందుకున్న హుసామ్కు మంగళవారం అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. క్వార్టర్స్లో ప్రపంచ చాంపియన్ మీరాజిజ్బేక్ (ఉజ్బెకిస్థాన్)తో హుసామ్ తలపడనున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ న్యూఢిల్లీలో జరుగాల్సి ఉన్నా.. కరోనా వైరస్ విజృంభణ కారణంగా దుబాయ్కు తరలించారు. 17 దేశాలకు చెందిన 150 మంది బాక్సర్లు పాల్గొంటున్న ఈ చాంపియన్షిప్లో భారత్ నుంచి 19 మంది బరిలో ఉన్నారు. సోమవారమే జరిగిన మరో బౌట్లో భారత బాక్సర్ శివ థాపా (64 కేజీలు) 5-0తో దిమిత్రి పుచిన్ (కజకిస్థాన్)పై విజయం సాధించాడు.
మహిళల విభాగంలో పోటీ తక్కువగా ఉండటంతో భారత్ నుంచి ఏడుగురు బాక్సర్లు నేరుగా సెమీస్ చేరి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. మేరీకోమ్ (51 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), అనుపమ (ప్లస్ 81 కేజీలు), సవీటి బురా (81 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), లాల్బుత్సహి (64 కేజీలు) మోనిక (48 కేజీలు) ఈ జాబితాలో ఉన్నారు. భారత్ నుంచి ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన మేరీకోమ్, లవ్లీనా, పూజా రాణి, సిమ్రన్జిత్ కౌర్ (60 కేజీలు), అమిత్ పంగాల్ (52 కేజీలు), ఆశిష్ కుమార్ (69 కేజీలు), వికాస్ (69 కేజీలు) ఆసియా చాంపియన్షిప్లో తమ పంచ్లకు పదును పెంచుకునేందుకు తహతహలాడుతున్నారు.