ముంబై: భవిష్యత్తులో నిర్ణయాత్మక విధానాల్లో సాంకేతికత అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. సోమవారం ఓ వెబినార్లో పాల్గొన్న కుంబ్లే మాట్లాడుతూ.. ‘ఇప్పటికే క్రికెట్లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) ప్రభావం ఉంది. భవిష్యత్తులో నిర్ణయాత్మక విధానాలు తీసుకోవడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆవిష్కరణలను ఆటగాళ్లు అంగీకరించాలి. లేకుంటే మీరు వెనుకబడిపోతారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతను ఉపయోగించుకోవడం ఆటకూ మంచిది’ అని అన్నాడు. టీవీలే గాక క్రీడా సమాఖ్యలు కూడా టెక్నాలజీని వినియోగించుకోవాలని కుంబ్లే సూచించాడు.