హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్లో టీమ్ మైసా(12 పాయింట్లు) ఆధిక్యంలో కొనసాగుతున్నది. టోర్నీలో రెండు రౌండ్లు ముగిసే సరికి టీమ్ మైసా అగ్రస్థానంలో ఉండగా, విలాజియో హైలాండర్స్(11), క్లాసిక్ చాంప్స్(11) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశలో ఐదు క్యాలిఫయింగ్ రౌండ్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ నుంచి అర్హత సాధించిన రెండు జట్లు క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ ఆడుతాయి. గురువారం అడపాదడపా వర్షం కురిసినప్పటికీ జట్ల మధ్య పోటీ వాతావరణం నెలకొన్నది. దీపక్ గుల్లపల్లికి చెందిన మాధవ్ కోట కెప్టెన్సీలోని టీమ్ మైసా ప్రత్యర్థి జట్ల కంటే ముందంజలో దూసుకెళుతున్నది. మరోవైపు టీమ్ టీఆఫ్ తరఫున బరిలోకి దిగిన మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు ఆకట్టుకున్నాడు.