మంత్రి పువ్వాడ అజయ్ సూచనతో ఇంటింటికీ వెళ్లి చెక్కులు
రెండు రోజుల్లో రూ.3.57 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
357 మందికి ప్రయోజనం
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
ఖమ్మం, మే 20: కరోనా కష్ట కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ మాత్రం ఆగకుండా చర్యలు చేపట్టారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. సాధారణ రోజుల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అజయ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించేవారు. తరువాత నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు స్వయంగా అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ తీవ్రత దృష్ట్యా అందరూ ఒకే వేదిక వద్దకు రావడంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున మంత్రి మరో ఆలోచన చేశారు. ఏ డివిజన్ లబ్ధిదారులకు ఆ డివిజన్లోనే చెక్కులు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. నగరంలో అయితే స్థానిక కార్పొరేటర్, గ్రామాల్లో అయితే స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి లాక్డౌన్, కరోనా నిబంధనలు పాటిస్తూ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. గడిచిన రెండో రోజుల్లో ఖమ్మం నియోజకవర్గంలో 357 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు చెక్కులు నేరుగా తమ ఇళ్లకు వస్తుండడంతో లభ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అజయ్కుమార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బుధ, గురువారాల్లో ఖమ్మం నగరంలో రూ.2.93 కోట్ల విలువైన 293 చెక్కులను, రఘునాథపాలెం మండలంలో రూ. 6.07 లక్షల విలువైన 64 చెక్కులను అందజేశారు. మొత్తంగా ఈ రెండు పథకాల ద్వారా నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 3,292 మంది లబ్ధిదారులకు రూ.46 కోట్ల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.