లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఓడిపోతేగానీ బీసీసీఐ మేలుకోలేదు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఫైనల్ బరిలో దిగిన కోహ్లి సేన భారీ మూల్యమే చెల్లించింది. ఈ మ్యాచ్ తర్వాత ప్లేయర్స్తోపాటు చాలా మంది ప్రాక్టీస్ మ్యాచ్ ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. దీంతో ఇప్పుడు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడే చాన్సివ్వాలని బీసీసీఐ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును కోరింది. దీనికి ఈసీబీ కూడా అంగీకరించింది. జులై 20-22 మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను నిర్వహించనుంది. అయితే ప్రస్తుతానికి ప్రత్యర్థి టీమ్ ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం బయో బబుల్ నుంచి బయటపడి స్వేచ్ఛగా విహరిస్తున్న ఇండియన్ టీమ్ తిరిగి రాగానే ఈ మ్యాచ్ జరగనుంది.
నిజానికి ఫైనల్ మ్యాచ్ తర్వాత కోహ్లి కూడా ప్రాక్టీస్ మ్యాచ్పై స్పందించాడు. అది మా చేతుల్లో ఉండదు. అయితే మేము మాత్రం ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాలనే అనుకుంటాం. ఈసారి అది మాకు దక్కలేదు. దాని వెనుక కారణాలేంటో నాకు తెలియదు. కానీ తొలి టెస్ట్ ముందుకు మేము సిద్ధం కావడానికి సరిపడా సమయమైతే ఉంది అని కోహ్లి అన్నాడు.