దుబాయ్: స్క్విడ్ గేమ్( Squid Game ).. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోందీ వెబ్సిరీస్. నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ కొరియన్ సిరీస్ ఆ ఓటీటీలో ఆల్టైమ్ హై వ్యూస్ సాధించిన వెబ్సిరీస్గా నిలిచింది. కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే అందులోని డల్గోనా క్యాండీ చాలెంజ్ను ఇప్పుడు టీమిండియా ప్లేయర్స్ స్వీకరించడం విశేషం. ఈ చాలెంజ్లో భాగంగా క్యాండీలో ఉన్న ఆకారాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా బయటకు తీయాలి. అలా తీయలేకపోయిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయడం ఈ వెబ్సిరీస్లో చూడొచ్చు. అలాంటి చాలెంజ్ను మన ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్ సరదాగా తీసుకొని ఆడారు.
ఈ ప్రమోషనల్ వీడియోను ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నరాలు తెగే ఉత్కంఠకు గురిచేసే గేమ్లో ఇండియా పాల్గొంటోంది అంటూ ఐసీసీ ఈ వీడియోను పోస్ట్ చేసింది. రోహిత్ శర్మ, మహ్మద్ షమి తప్ప రాహుల్, సూర్యకుమార్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాలాంటి వాళ్లు ఇందులో ఫెయిలయ్యారు. ఈ నెల 24న పాకిస్థాన్తో జరగబోయే తొలి మ్యాచ్లో టీమిండియా తలపడనున్న విషయం తెలిసిందే. రెండు వామప్ మ్యాచ్లలోనూ గెలిచి కోహ్లి సేన మాంచి ఊపు మీద కనిపిస్తోంది.