ప్రతి క్షేత్రానికీ ఓ స్థల పురాణం ఉంటుంది. అష్టాదశ పురాణాల్లోనూ కనిపించని దివ్యచరిత్ర దాగి ఉంటుంది. కొన్ని ఆశ్చర్యకరంగా, కొన్ని నమ్మశక్యం కానట్టుగా ఉంటాయి. ఈ పెద్దమ్మ తల్లి క్షేత్రకథ అలాంటిదే! వి‘చిత్ర’ ఐతిహ్యంతో కూడిన ఈ దేవాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం సమీపంలోని జగన్నాథ పురంలో ఉంది. భద్రాద్రికి వెళ్లే దారిలో ఉన్న ఈ ఆలయ విశేషాలు చదివేయండి.అనగనగా ఓ బాటసారి. ఎక్కడినుంచి వస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. చేతిలో అమ్మవారి చిత్తరువు. చకచకా వెళ్లిపోతున్నాడు. ఇంతలో బోరున వర్షం. ఆయనకేమో ఆగే తీరిక లేదు. అలాగని ముందుకు కదిలితే అమ్మోరి చిత్రం పాడైపోతుంది! చుట్టూ చూశాడు. చెంతనే ఓ పెద్ద చింతచెట్టు. దాని మొదట్లో ఓ తొర్ర. ఇక్కడైతే పటం తడవకుండా జాగ్రత్తగా ఉంటుందని భావించాడు. ఆ ఫొటోను అక్కడుంచి, దండం పెట్టుకొని బయల్దేరాడు.
దారిలో దేవత
రోజులు గడిచిపోయాయి. ఓ ఇంటాయన ఆ దారిన వెళ్తున్నాడు. చెట్టుకింద కన్నంలో ఓ చిత్రం కంట పడింది. బొట్టెట్టి అమ్మోరు తల్లికి మనసారా దండం పెట్టుకున్నాడు. ఏదో కోరుకున్నాడు. ఇంకో ముత్తయిదువ అటుగా వచ్చింది. అమ్మవారు చిత్రపటంపై చారెడు పసుపు పోసి తన కష్టాలు తీర్చమంటూ వేడుకుంది. ఆతడి కోరిక నెరవేరింది. ఆమె కష్టాలు తీరాయి. పాల్వంచనుంచి భద్రగిరికి వెళ్లే దారిలో ఉంటుంది ఈ చింతచెట్టు. ఆ దారిలో భద్రాచలం పోయే భక్తులంతా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ఏ ముహూర్తాన ఆ బాటసారి అమ్మవారి చిత్రపటం ఇక్కడ పెట్టాడోగానీ, ఆనాటినుంచి ఇదో క్షేత్రంగా మారిపోయింది. చిత్రంలోని అమ్మవారు గ్రామదేవతగా, పెద్దమ్మ తల్లిగా భక్తుల పాలిట కొంగుబంగారమైంది.
అమ్మోరికి ఆలయం
1956 ప్రాంతం నుంచే ఇక్కడ పూజలు జరుగుతున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. అదే సమయంలో నల్గొండ జిల్లాకు చెందిన వ్యాపారి జగ్గారెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన అమ్మవారి భక్తుడు కావడంతో ఆలయ అభివృద్ధికి నడుం బిగించారు. అంతేకాదు, ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ గ్రామం ఏర్పడిందని, దీంతో ఆయన పేరిట ఊరికి జగన్నాథపురం అన్న పేరు వచ్చిందనీ చెబుతారు. స్థానికుల సహకారంతో 1962 ప్రాంతంలో చింతచెట్టుకు సమీపంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, చిన్న పందిరి వేయించారు. ఆలయ అభివృద్ధికి నలుగురు భక్తులతో ఓ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. క్రమేపీ ఆదాయం పెరగడంతో, దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. భక్తుల విడిదికోసం మంటపాలు, ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. కాలక్రమంలో భద్రాచలం వెళ్లేదారికి రహదారి ఏర్పాటు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది.గుడికి ఇప్పటికే 9 ఎకరాల భూమి ఉంది. నాడు లక్షల్లో ఉన్న ఆదాయం నేడు కోట్లకు చేరుకుంది.
వేడుకలకు వేదిక
1979 నుంచి దసరా సందర్భంగా ఆలయంలో నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఏటికేడు అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2001-02 సంవత్సరంలో ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి వెళ్లింది. ఏటికేడు ఆలయ ఆదాయం పెరుగుతున్నది. చుట్టుపక్కల జిల్లాలకు చెందిన భక్తులుసైతం ఆలయానికి వరుసలు కడుతున్నారు. ప్రతి ఆదివారం వేలమంది భక్తులు అమ్మవారిని సందర్శిస్తుంటారు. బిడ్డలు పుట్టినా, ఆ పుట్టిన బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించాలన్నా పెద్దమ్మతల్లి ఆలయానికి వస్తారు భక్తులు. అమ్మవారి సన్నిధిలో పెండ్లిళ్లుకూడా జరుగుతాయి. ప్రధాన ఆలయానికి అనుబంధంగా సరస్వతి, అన్నపూర్ణ ఆలయాలనూ నిర్మించారు. దసరా, ఉగాది పర్వదినాలు, శ్రావణమాసం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువ. సామాన్య భక్తులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అనేకమంది, అమ్మవారిని దర్శించుకుంటారు.
-కాగితపు వెంకటేశ్వరరావు, కొత్తగూడెం