జైపూర్ : రాజస్ధాన్లో మహిళలకు, బాలికలకు రక్షణ లేదని అశోక్ గెహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కాషాయ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గత ఆరు నెలల్లో రాష్ట్రంలో లైంగిక దాడుల కేసులు ఏకంగా 30 శాతం ఎగబాకాయని వచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. మైనర్ బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక నేరాలు పెరుగుతున్నాయని రాజస్ధాన్ లైంగిక దాడుల రాజధానిగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.
రాజస్ధాన్లో అసలు చట్టబద్ధ పాలన అటకెక్కిందని విమర్శించింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సహా కాంగ్రెస్ నేతలంతా మౌనం దాల్చారని బీజేపీ నేత సమన్ శర్మ మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో లైంగిక దాడుల కేసులను ఎక్కువ చేసి చూపుతున్నారని కాషాయ పార్టీకి కాంగ్రెస్ దీటుగా బదులిచ్చింది. ఇక లైంగిక దాడుల కేసులు పెరుగుతుండటంపై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య రాజకీయ మాటల యుద్ధానికి తెరలేచింది.