కోల్ కతా : కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ లో విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగించినట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అడ్డకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు. ఇక లాక్డౌన్ నియంత్రణలకు రాష్ట్ర ప్రభుత్వం కొంత మేర సడలింపులు ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం బెంగాల్ లో ప్రభుత్వ కార్యాలయాలను 25 శాతం సిబ్బందితో తెరిచేందుకు అనుమతించారు.
ప్రైవేట్ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ 25 శాతం సిబ్బందితో పనిచేసే వెసులుబాటు కల్పించారు. షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్ లను 50 శాతం సిబ్బందితో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓపెన్ చేసేందుకు అనుమతించారు. ప్రేక్షకులు లేకుండా క్రీడా కార్యకలాపాలకు వెసులుబాటు కల్పించారు. విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుండగా అత్యవసర సేవలు మినహా లాక్డౌన్ సమయంలో ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిలిపివేశారు.