రాష్ట్ర వ్యాప్తంగా 3,028 ఏర్పాటు చేశాం
తూకాల వద్ద రైతులకు నష్టం రాకుండా చూడాలి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్
వనపర్తి, ఏప్రిల్ 23 : వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,028 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సంచికి 40 కిలోల 700 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వేయాలని సూచించారు. తూకాల వద్ద పకడ్బందీగా వ్యవహరించి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. నాణ్యతగల ధాన్యం తెచ్చిన రైతులను అభినందించి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలోని సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ వద్ద ఉన్న టార్ఫాలిన్లు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వ నిబంధనలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు రైతులకు అర్థమయ్యేలా ప్రజా ప్రతినిధులు వివరించాలన్నారు. వరి కోతలు పూర్తయిన తర్వాత రైతులు పొలాల్లో గడ్డిని కాల్చవద్దని, అధికారులు ఈ విషయమై చైతన్య పర్చాలన్నారు. వానకాలం సాగులో పత్తి, కంది సాగుతోపాటు సన్న వడ్ల పంటను పెంచాలన్నారు. ఇప్పటి నుంచే ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని మంత్రి సూచించారు. ఉపాధి కింద అన్ని గ్రామాల్లో కాల్వల పూడికతీత పనులు వందశాతం పూర్తి కావాలని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా పనులు చేపట్టకపోతే.. సంబంధిత సర్పంచ్, కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తూతూ మంత్రంగా పనులు చేసినా, చేపట్టకపోయినా సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి