20రోజుల్లో అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి సర్వే పూర్తి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట సాగునీటి పథకానికి చంద్రసాగర్ వద్ద సర్వేకు భూమిపూజ
అచ్చంపేట, మార్చి 29: నల్లమల ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని, బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించి రైతుల కాళ్లు కడుగుతామని చెప్పిన మాటకు కట్టుబడి అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని సాధించానని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం అచ్చంపేట ఎత్తిపోతల పథకం సర్వేపనులను అట్టహాసంగా ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఉమామహేశ్వరం ఆలయంలో కలెక్టర శర్మర్, ఇరిగేషన్ శాఖ సర్వే అధికారులు, గువ్వల బాలరాజు దంపతులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా పదర మండలం రాయలగండి చెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకున్నారు. మన్ననూర్, అమ్రాబాద్, రాయలగండి ఆలయం వద్ద ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. అచ్చంపేట మండలం చంద్రసాగర్ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సర్వేకు భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20రోజుల్లో సర్వే పనులు పూర్తి చేసుకొని టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే వచ్చే మేలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన ఉంటుందని చెప్పారు. నియోజకవర్గంలోని అచ్చంపేట, అమ్రాబాద్, లింగాల, పదర, బల్మూర్ మండలాల్లో 70వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా డిజైన్ చేసిన అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి స్వయంగా నా చేతుల మీదుగా సర్వే పనులు ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించి బల్మూర్ వద్ద నిర్మించే 2.50టీఎంసీల ఉమామహేశ్వరం రిజర్వాయర్ నింపి కొత్త కాలువ ద్వారా బల్మూర్, లింగాల, అచ్చంపేట మండలాల్లో 45వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఉమామహేశ్వరం రిజర్వాయర్ నుంచి కాలువ తీసి చంద్రసాగర్లో 0.3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి లిఫ్టు ఏర్పాటు చేసి మన్ననూర్ వద్ద కొత్తగా నిర్మించే 1.5 టీఎంసీల చెన్నకేశవ రిజర్వాయర్ను నింపి అమ్రాబాద్, పదర మండలాల్లో 25వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
అచ్చంపేట మండలం పుల్జాల నుంచి చంద్రసాగర్ వరకు ఎంజీకేఎల్ఐ కాలువను 14 కి.మీ. వరకు వరకు పొడగించి మరో 15వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఇప్పటికే కేఎల్ఐ ద్వారా ఉప్పునుంతల, వంగూరు, లింగాల, బల్మూర్, అచ్చంపేట కొంత భాగానికి 70వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా నీళ్లను పారించాలనే లక్ష్యంతో ముందకెళ్తున్నామన్నారు. జిల్లా ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు ఏదుల రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీళ్లను తరలించి అచ్చంపేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఈ సత్యనారాయణగౌడ్, ఏఈ గంగాధర్, సర్వే ఏజెన్సీ మధుసూదన్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పోకల మనోహర్, సీఎంరెడ్డి, నర్సింహారెడ్డి, ప్రతాప్రెడ్డి, అరుణ, రాంబాబు, రాజేశ్వర్రెడ్డి, రవీందర్రెడ్డి, చెన్నకేశవులు, గోపాల్నాయక్, శైలజ, భూపాల్రావు, రానోజి, హన్మంతు, కోనేటి తిరుపతయ్య, శంకర్, శ్రీరాం, డాక్టర్ విష్ణుమూర్తి, సుధాకర్ పాల్గొన్నారు.