న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సాగుతున్న సుదీర్ఘ సందిగ్ధతకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెరదించాడు. మెగాటోర్నీని భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తరలిస్తామని స్పష్టం చేశాడు. భారత్లో కరోనా వైరస్ ప్రభావంపై అనిశ్చితి కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చామని సోమవారం ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. ‘టీ20 ప్రపంచకప్ను యూఏఈకి తరలించవచ్చని మేం ఐసీసీకి చెప్పాం. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని దాదా చెప్పాడు. మెగాటోర్నీకి యూఏఈ వేదికైనా బీసీసీఐయే ఆతిథ్యమివ్వనుంది. మరోవైపు ప్రపంచకప్ అక్టోబర్ 17న ప్రారంభమవుతుందా అన్న ప్రశ్నకు దాదా స్పందించాడు. ఇంకా తేదీల విషయంలో తుది నిర్ణయానికి రాలేదన్నాడు. అలాగే ప్రపంచకప్ తరలింపుపై బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ర్టాల బోర్డులకు రాశాడు. యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబితో పాటు ఒమన్లో టీ20 మెగాటోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ సుముఖంగా ఉంది. మరోవైపు ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ మ్యాచ్లను అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు బీసీసీఐ యూఏఈలోనే నిర్వహించనుంది. కరోనా ఆందోళనతోనే లీగ్ వేదికను బీసీసీఐ మార్చగా.. అప్పటి నుంచే ప్రపంచకప్ తరలింపుపైనా చర్చ మొదలైంది.