న్యూఢిల్లీ: టీ20 వరల్డ్కప్ను యూఏఈలో నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎమిరేట్స్ క్రికెట్ క్లబ్తో బీసీసీఐ మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంక క్రికెట్ కూడా ఆ టోర్నీ నిర్వహించేందుకు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. బీసీసీఐతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ మీడియా సంస్థ ద్వారా వెల్లడైంది. యూఏఈలో ఇప్పటికే ఐపీఎల్ మిగితా మ్యాచ్లను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడే మళ్లీ వరల్డ్కప్ నిర్వహించడం సాధ్యమా అన్న కోణంలో ఆలోచనలు చేస్తున్నారు. యూఏఈలో కేవలం షార్జా, దుబాయ్, అబు దాబిల్లో మాత్రమే స్టేడియాలు ఉన్నాయని, కానీ కొలంబోలో పట్ణంలోనూ మూడు స్టేడియాలు ఉన్నట్లు ఒకరు తెలిపారు. సెప్టెంబర్లో ఐపీఎల్ నిర్వహణకు తాము కూడా సిద్ధమే అని ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ టీ20 వరల్డ్కప్ను బయట నిర్వహించాలనుకుంటే, అప్పుడు పన్ను మినహాయింపు కోసం ఐసీసీని సంప్రదించాల్సి ఉంటుందని, జూన్ 15వ తేదీలోగా ఆ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఈవెంట్ నిర్వహణ కోసం ఐసీసీకి జూన్ 28వ తేదీలోగా చెప్పాల్సి ఉంటుందని కొన్ని వర్గాల ద్వారా వెల్లడైంది. వరల్డ్కప్ ఈవెంట్ బయటి దేశంలో జరిగినా.. ఆ హోస్టింగ్ రైట్స్ మాత్రం బీసీసీఐ వద్దే ఉంటాయని గతంలో ఐసీసీ స్పష్టం చేసింది.