ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్నా కూడా బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐపీఎల్ను ప్రారంభించింది. కఠినమైన బయో బబుల్లో ప్లేయర్స్ను ఉంచి, ప్రేక్షకులను మైదానాలకు రాకుండా చేసి మ్యాచ్లు నిర్వహించారు. కానీ నెల రోజులు కూడా కాకుండానే వాయిదా వేయాల్సి వచ్చింది. బబుల్ను ఛేదించుకొని కరోనా ప్లేయర్స్కి సోకడంతో చేసేది లేక వాయిదా వేసింది. దీని వల్ల ఇప్పుడు అక్టోబర్, నవంబర్లలో జరగాల్సిన టీ20 వరల్డ్కప్పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. నిజానికి దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని ఎంచుకుందన్న వార్తలు చాలా రోజుల కిందటే వచ్చాయి.
ఇక ఇప్పుడు ఐపీఎల్ వాయిదా పడటంతో టీ20 వరల్డ్కప్ను యూఏఈకి తరలించడం దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఆ టోర్నీలో 16 టీమ్స్ పాల్గొంటాయి. అసలే అంతర్జాతీయ టోర్నీ. ఏమాత్రం తేడా వచ్చినా బీసీసీఐతోపాటు భారత ప్రభుత్వ పరువు కూడా పోతుంది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా టీమ్స్ కూడా ఇండియాకు రావాలంటే జంకుతున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో టోర్నీని తరలిస్తేనే బెటర్ అన్న ఆలోచన బోర్డు చేస్తోంది. ఈ మధ్యే బోర్డు పెద్దలు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పీటీఐ వెల్లడించింది.
ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న సంక్షోభంలో ఆ మెగా టోర్నీని ఇక్కడి నుంచి తరలిండమే మంచిదన్న అభిప్రాయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యక్తం చేశారు. పైగా అక్టోబర్ సమయంలోనే కరోనా మూడో వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో బీసీసీఐ దగ్గరే హోస్టింగ్ హక్కులను పెట్టుకొని యూఏఈలో టోర్నీ నిర్వహించడమే ఉత్తమమని ఆ అధికారి అన్నారు.