కొలంబో: కరోనా కలకలంతో ఒకరోజు ఆలస్యంగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ఉన్న వనరులతోనే బరిలోకి దిగిన ధావన్ సేన ఉత్కంఠ పోరులో పరాజయం వైపు నిలిచింది. బుధవారం ఇక్కడ జరిగిన రెండో టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరుగాల్సిన ఈ మ్యాచ్.. టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో బుధవారానికి వాయిదా పడింది. కృనాల్తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లు మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోవడంతో ఈ పోరులో భారత్ నలుగురు (పడిక్కల్, గైక్వాడ్, రాణా, సకారియా) కొత్త కుర్రాళ్లను బరిలో దింపింది. స్టాండ్బైగా ఎంపిక చేసిన వారిలోనూ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేకపోవడంతో.. ఈ పోరులో టీమ్ఇండియా ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (40) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా..
అంతర్జాతీయ స్థాయిలో తొలి
మ్యాచ్లోనే దేవదత్ పడిక్కల్ (29), రుతురాజ్ గైక్వాడ్ (21) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఛేదనలో లంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (40 నాటౌట్), భానుక (36) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్కు 2, భువనేశ్వర్, సకారియా, వరుణ్, చాహర్కు ఒక్కో వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య నేడు నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది.
నలుగురు అరంగేట్రం..
ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన దవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశారు. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడటంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది (హార్దిక్, పృథ్వీషా, సూర్యకుమార్, చాహల్, కృష్ణప్ప గౌతమ్, ఇషాన్ కిషన్, మనీశ్ పాండే) ఆటగాళ్లు ఈ మ్యాచ్కు దూరమయ్యారు.
స్కోరు బోర్డు
భారత్: గైక్వాడ్ (సి) భానుక (బి) షనక 21, ధావన్ (బి) ధనంజయ 40, పడిక్కల్ (బి) హసరంగ 29, శాంసన్ (బి) ధనంజయ 7, రాణా (సి) ధనంజయ డిసిల్వా (బి) చమీర 9, భువనేశ్వర్ (నాటౌట్) 13, సైనీ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 132/5. వికెట్ల పతనం: 1-49, 2-81, 3-99, 4-104, 5-130, బౌలింగ్: చమీర 4-0-23-1, చమిక 1-0-6-0, అఖిల 4-0-29-2, ఉడాన 1-0-7-0, హసరంగ 4-0-30-1, షనక 2-0-14-1, రమేశ్ 2-0-9-0, ధనంజయ డిసిల్వ 2-0-13-0.
శ్రీలంక: అవిష్క (సి) చాహర్ (బి) భువనేశ్వర్ 11, భానుక (సి) చాహర్ (బి) కుల్దీప్ 36, సమరవిక్రమ (బి) వరుణ్ 8, షనక (స్టంప్డ్) శాంసన్ (బి) కుల్దీప్ 3, ధనంజయ (నాటౌట్) 40, హసరంగ (సి) భువనేశ్వర్ (బి) చాహర్ 15, రమేశ్ (సి) గైక్వాడ్ (బి) సకారియా 2, చమిక (నాటౌట్) 12, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 19.4 ఓవర్లలో 133/6. వికెట్ల పతనం: 1-12, 2-39, 3-55, 4-66, 5-94, 6-105, బౌలింగ్: భువనేశ్వర్ 4-0-21-1, సకారియా 3.4-0-34-1, వరుణ్ 4-0-18-1, రాహుల్ చాహర్ 4-0-27-1, కుల్దీప్ 4-0-30-2.