ప్రముఖ సినిమా జర్నలిస్ట్, నటుడు TNR కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసి హీరో నాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ”TNR కన్నుమూశారని తెలిసి షాకయ్యా. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి మనసులో మాటలను జనానికి వినిపించిన ఆయన మరణం బాధాకరం” అని నాని పేర్కొన్నారు.
”స్క్రీన్ షేర్ చేసుకున్నాం. స్టేజ్ షేర్ చేసుకున్నాం. కలిసినప్పుడల్లా, ‘నీతో అందరూ ఇంటర్వ్యూలు చేసేసారు. నేను ఎప్పుడో చేస్తాను. అది చాలా స్పెషల్గా ఉండాలి, ఉంటుంది’ అనేవాడు. దర్శకుడు అవుదామని వచ్చాడు. ఇరవైఏళ్లుగా ఏవేవో చేసాడు. ఇంటర్వ్యూయర్గా చాలా ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో యాక్టర్గా విజృంభణలో ఉన్నాడు. త్వరలో దర్శకత్వం అన్నాడు. కానీ ఇలా ఈ లోకం విడిచి వెళ్లాడు” అని కత్తి మహేష్ ఆవేదన చెందారు. టీఎన్ఆర్ అకాల మరణం ఎంతో బాధ కలిగించింది. మంచి మనస్తత్వం ఉన్న మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అని అనీల్ రావిపూడి ట్వీట్ చేశారు. గోపిచంద్ మలినేని, దర్శకుడు మారుతి, సందీప్ కిషన్ సంతాపం తెలియజేశారు.