యాదాద్రి, ఏప్రిల్26: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం వైష్ణవ, శైవ సంప్రదాయ రీతిలో ఆరాధనలు జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొల్పిన అర్చకులు బాలాలయంలో కవచమూర్తులకు హారతి నివేదించారు. బిందెతీర్థం, బాలబోగం నిర్వహించి ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వహించారు. కల్యాణ మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణాన్ని అర్చకు లు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర బాలాలయంలో శివుడికి ఆరాధించిన పురోహితులు చరమూర్తులను కొలుస్తూ వేదమంత్ర పఠనాల మధ్య మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిళ్వార్చనలు నిర్వహించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుడిని కొలుస్తూ సుమారు గంటన్నరపాటు జరిగిన రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఉదయాన్నే పరమశివుడిని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. నిత్యకల్యాణోత్సవంలో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించి పాల్గొన్నారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజ ల్లో భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి నిత్యపూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.
దబ్బగుంటపల్లి ఆలయంలో రాజగోపుర చక్రశిఖర లఘు సంప్రోక్షణ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం రాజగోపుర చక్రశిఖర లఘు సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా జరిపారు.
స్వామి వారి ఖజానాకు రూ.2,85,461 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.2,85,461 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.12,780, రూ.100 దర్శనాలతో రూ.400, వీఐపీ దర్శనాలతో రూ.7,650, క్యారీబ్యాగులతో రూ. 1,375, వ్రతాలతో రూ.7,000, కల్యాణకట్టతో రూ. 9,000, ప్రసాద విక్రయాలతో రూ.1,73,085, వాహన పూజలతో రూ.1,400, టోల్గేట్ ద్వారా రూ.530, అన్నదాన విరాళంతో రూ.10,116, సువర్ణ పుష్పార్చనతో రూ. 24,988, యాదరుషి నిలయంతో రూ.12,500, శివాలయం ద్వారా రూ.532, పాతగుట్టతో రూ. 1,820, టెం కాయల విక్రయాలతో రూ.14,400 తో కలిపి స్వామివారికి రూ. 2,85,461 ఆదాయం లభించిందని తెలిపారు.