వెంగళరావునగర్, జూన్ 16: దేశంలోనే తెలంగాణ పోలీసుశాఖ నెంబర్ వన్ స్థానంలో ఉందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం నూతనంగా నిర్మించిన ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ భవనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్లతో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖకు భారీగా నిధులు ఇస్తున్నారని తెలిపారు.పెట్రోలింగ్ కోసం రూ.700 కోట్లు కేటాయించారని అన్నారు. మరో ఆరు నెలల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి రానున్నదని తెలిపారు.
అంతేకాక మరో 21 పోలీస్స్టేషన్ల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమర్థవంతంగా పోలీసింగ్ వ్యవస్థ ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని.. అప్పుడే నిరుద్యోగ సమస్య తగ్గుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అభ్యర్థనకు స్పందిస్తూ త్వరలో బోరబండ లేదా రహ్మత్నగర్లో పోలీస్స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనలు పంపారని స్పష్టం చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పాత ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ను ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు కేటాయిస్తున్నామని తెలిపారు. 2014 తర్వాత ఎస్ఆర్ నగర్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అత్యధిక జనాభా, ఎక్కువ నేరాలు నమోదయ్యే రహ్మత్ నగర్లో మరో పోలీస్స్టేషన్ ఏర్పాటు విషయమై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశయాలు.. ప్రజలకు నచ్చేలా పోలీసింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజామిత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నామని అన్నారు. నూతన భవనంతో ఎస్ఆర్ నగర్ పోలీసులకు బాధలు తప్పాయమన్నారు. పోలీస్శాఖకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ తన నియోజకవర్గం ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉండటంతో బాధితులు ఇక్కడికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బోరబండ లేదా రహ్మత్ నగర్లో మరో పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేయాలని మంత్రులు మహమూద్, తలసాని, డీజీపీ మహేందర్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని మంత్రులు, పోలీసు అధికారులు పరిశీలించారు.
వసతులు, ఆయా విభాగాల పనితీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, తెలంగాణ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ కె.దామోదర్, నగర పోలీస్ అదనపు కమిషనర్లు షిఖాగోయల్, అనిల్ కుమార్, జాయింట్ సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, అదనపు డీసీపీ సిద్ధిఖీ, పంజాగుట్ట ఏసీపీ గణేశ్, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, కార్పొరేటర్లు కొలను లక్ష్మి, దేదీప్య, షాహీన్ బేగం, వనం సంగీతాయాదవ్, సి.ఎన్.రెడ్డి, రాజ్కుమార్ పటేల్, మాజీ కార్పొరేటర్ శేషకుమారి, జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వైస్ చైర్మన్ పి.వి.రవిశేఖర్రెడ్డి పాల్గొన్నారు.