ఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(57: 55 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), మనీశ్ పాండే(61: 46 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో సన్రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో కేన్ విలియమ్సన్(26 నాటౌట్: 10 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్), కేదార్ జాదవ్(12 నాటౌట్: 4 బంతుల్లో ఫోర్, సిక్స్) దంచికొట్టడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా కరన్ ఒక వికెట్ పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే జానీ బెయిర్స్టో(7) భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. బెయిర్స్టో పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ ఆచితూచి ఆడింది. పవర్ప్లే ఆఖరికి 39/1తో నిలిచింది. వార్నర్ ఆరంభం నుంచి ధాటిగా ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. వికెట్ కాపాడుకుంటూ ఎక్కువగా సింగిల్స్ తీస్తూ మనీశ్కు సహకారం అందించాడు.
పాండే వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓవైపు చెన్నై కట్టుదిట్టంగా బంతులేస్తున్నా చెత్తబంతులను బౌండరీలు తరలించారు. వీరిద్దరూ 100కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్ధశతకాలు పూర్తైన తర్వాత వేగంగా ఆడే క్రమంలో వికెట్లు చేజార్చుకున్నారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేన్ మెరుపులు మెరిపించాడు. శార్దుల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో కేన్ 4 6 4 4 బాది 20 రన్స్ రాబట్టాడు. కరన్ వేసిన చివరి ఓవర్లో జాదవ్ 4,6 కొట్టడంతో జట్టు స్కోరు 170 దాటింది.