దుబాయ్: ఐపీఎల్( IPL 2021 ) అరంగేట్ర మ్యాచ్లోనే తన స్పీడ్తో అదరగొట్టాడు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. తన తొలి మ్యాచ్లోనే ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఇండియన్ పేస్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. అతడు ఏకంగా గంటకు 151.03 కిలోమీటర్ల వేగంతో విసిరిన ఓ బంతి ఆశ్చర్యపరిచింది. ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో అతడు ఈ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన డెలివరీ కేకేఆర్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ పేరిట ఉంది. అతడు గంటకు 152.75 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.
ఇప్పటి వరకూ ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఇండియన్ బౌలర్గా మహ్మద్ సిరాజ్ (గంటకు 145.97 కి.మీ.) ఉన్నాడు. ఇప్పుడా రికార్డు బద్ధలైంది. నిజానికి కరోనా బారిన పడిన నటరాజన్ స్థానంలో తాత్కాలికంగా ఉమ్రాన్ మాలిక్ను సన్రైజర్స్ తీసుకుంది. అతడు చాలాకాలంగా నెట్ బౌలర్గా ఉన్నాడు. జమ్ముకశ్మీర్కు చెందిన ఉమ్రాన్.. ఆ టీమ్ తరఫున ఒక టీ20, లిస్ట్ ఎ మ్యాచ్ ఆడి నాలుగు వికెట్లు తీశాడు. ఇప్పుడు ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్లోనే నిలకడగా 141 కి.మీ. తగ్గని వేగంతో బంతులు విసిరి ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన ఉమ్రాన్.. వికెట్ తీయలేకపోయాడు.