హమ్మయ్య.. సన్రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. వరుస పరాజయాలతో వీరాభిమానులు సైతం విసిగెత్తిపోయిన దశలో రైజర్స్ సమిష్టిగా సత్తా చాటింది. మొదట బౌలింగ్లో రాజస్థాన్ను ఓ మాదిరి స్కోరుకు పరిమితం చేసిన విలియమ్సన్ సేన.. ఆనక బ్యాటింగ్లో దుమ్మురేపింది. వార్నర్ స్థానంలో టీమ్లోకి వచ్చిన జాసన్ రాయ్.. రాయల్స్ బౌలర్లను చెడుగుడాడుకుంటే.. విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. రైజర్స్ ఇక్కడి నుంచి ప్లే ఆఫ్స్కు చేరడం దాదాపు అసాధ్యం కాగా.. ఈ పరాజయం రాజస్థాన్ అవకాశాలను దెబ్బతీసింది!
దుబాయ్: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ఆశలన్నీ అడుగంటిపోయాక సన్రైజర్స్ సత్తాచాటింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అనధికారికంగా దూరమైన హైదరాబాద్ సోమవారం 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (57 బంతుల్లో 82; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. యశస్వి జైస్వాల్ (36), మహిపాల్ లోమ్రర్ (29 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్రైజర్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానంలో బరిలోకి దిగిన ఓపెనర్ జాసన్ రాయ్ (42 బంతుల్లో 60; 8 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో లోమ్రర్, ముస్తఫిజుర్, చేతన్ సకారియా తలా ఒక వికెట్ పడగొట్టారు. రాయ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
నాలుగు మార్పులతో..
వరుస పరాజయాలతో డీలాపడిన సన్రైజర్స్ ఈ మ్యాచ్ కోసం జట్టులో నాలుగు మార్పులు చేసింది. మాజీ కెప్టెన్, రైజర్స్కు ఐపీఎల్ టైటిల్ అందించిన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను తుది జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్కు చాన్సిచ్చింది. అలాగే మనీశ్ పాండే, కేదార్ జాదవ్, ఖలీల్ అహ్మద్లను పక్కనపెట్టి వారి స్థానాల్లో అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్, సిద్ధార్థ్ కౌల్ను జట్టులోకి తీసుకుంది. ఈ మార్పులు హైదరాబాద్కు బాగా కలిసొచ్చాయి. చాన్నాళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు పడగొడితే.. బ్యాటింగ్లో జాసన్ రాయ్ విశ్వరూపం చూపాడు. ముస్తఫిజుర్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లతో వేగం పెంచిన రాయ్.. మోరిస్ వేసిన తదుపరి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విజృంభించాడు. ఫలితంగా ఐదు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 57/0తో నిలిచింది. ఆ తర్వాత సాహా (18) ఔటైనా.. విలియమ్సన్తో కలిసి రాయ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తెవాటియా ఓవర్లో 6,4,4,4, కొట్టిన రాయ్ 36 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రాయ్తో పాటు ప్రియం గార్గ్ (0) ఔటైనా.. అభిషేక్ శర్మ (21 నాటౌట్) అండగా.. విలియమ్సన్ జట్టుకు విజయాన్నందించాడు.
స్కోరు బోర్డు
రాజస్థాన్: లూయిస్ (సి) సమద్ (బి) భువనేశ్వర్ 6, జైస్వాల్ (బి) సందీప్ 36, శాంసన్ (సి) హోల్డర్ (బి) కౌల్ 82, లివింగ్స్టోన్ (సి) సమద్ (బి) రషీద్ 4, లోమ్రర్ (నాటౌట్) 29, పరాగ్ (సి) రాయ్ (బి) కౌల్ 0, తెవాటియా (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 7, మొత్తం: 164/5. వికెట్ల పతనం: 1-11, 2-67, 3-77, 4-161, 5-162, బౌలింగ్: సందీప్ 3-0-30-1, భువనేశ్వర్ 4-1-28-1, హోల్డర్ 4-0-27-0, కౌల్ 4-0-36-2, రషీద్ 4-0-31-1, అభిషేక్ 1-0-8-0.
హైదరాబాద్: రాయ్ (సి) శాంసన్ (బి) సకారియా 60, సాహా (స్టంప్డ్) శాంసన్ (బి) లోమ్రర్ 18, విలియమ్సన్ (నాటౌట్) 51, ప్రియం (సి అండ్ బి) ముస్తిఫిజుర్ 0, అభిషేక్ (నాటౌట్) 21, ఎక్స్ట్రాలు: 17, మొత్తం: 18.3 ఓవర్లలో 167/3. వికెట్ల పతనం: 1-57, 2-114, 3-119, బౌలింగ్: ఉనాద్కట్ 2-0-20-0, మోరిస్ 3-0-27-0, ముస్తిఫిజుర్ 3.3-0-26-1, లోమ్రర్ 3-0-22-1, తెవాటియా 3-0-32-0, సకారియా 4-0-32-1.