హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తున్నాయి. బుధవారం కొన్నిచోట్ల వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వానలు పడ్డాయి. రాగల 48 గంటలలో దక్షిణ, ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ కేరళ మీదుగా కోమరిన్ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి వానలు కురుస్తున్నట్టు పేర్కొన్నారు. వరుసగా మూడోరోజు బుధవారం కూడా కొన్నిచోట్ల వర్షాలు పడడంతో మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడింది.