వాంటా (ఫిన్లాండ్): ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన పోరులో భారత్ 0-5తో చైనా చేతిలో ఓటమి పాలై.. క్వార్టర్ ఫైనల్కు చేరే అవకాశాలను దూరం చేసుకుంది. ఈ టోర్నీలో 11 సార్లు చాంపియన్గా నిలిచిన చైనా షట్లర్లకు మనవాళ్లు ఏమాత్రం పోటీనివ్వలేకపోయారు. తొలి పోరులో మిక్స్డ్ డబుల్స్ జోడీ అర్జున్-ధ్రువ్ కపిల 20-22, 17-21తో లూ చెంగ్-జూ హౌ డాంగ్ ద్వయం చేతిలో ఓడగా.. పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 10-21, 10-21తో ఆల్ఇంగ్లండ్ చాంపియన్ షై యుఖీ చేతిలో ఓడాడు.
స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ గైర్హాజరీలో మహిళల సింగిల్స్ బరిలో దిగిన యంగ్ ప్లేయర్ అదితి భట్ 9-21, 8-21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ యూ ఫీ చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్లో తెలంగాణ షట్లర్ ఎన్.సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ 16-21, 13-21తో జెంగ్ యూ-లీ వెన్ మై ద్వయం చేతిలో ఓడగా.. మిక్స్డ్ డబుల్స్లో కిడాంబి శ్రీకాంత్-రుతుపర్ణ జంట 9-21, 9-21తో డు యే-ఫెంగ్ యాన్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. ఇక నామమాత్రమైన చివరి మ్యాచ్లో బుధవారం ఫిన్లాండ్తో భారత్ తలపడనుంది.