వాంటా (ఫిన్లాండ్): ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు శుభారంభం దక్కలేదు. గ్రూప్-‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో భారత్ 1-4తో థాయ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్లో అర్జున్-ధ్రువ్ కపిల జంట 21-18, 21-17తో సుపాక్ జొమ్ఖో-కెడ్రాన్ జోడీపై విజయం సాధించగా.. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో మనవాళ్లకు పరాజయాలు ఎదురయ్యాయి.
పురుషుల సింగిల్స్లో మాజీ ప్రపంచ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ 9-21, 19-21తో వితిద్సర్న్ చేతిలో ఓడగా.. మహిళల డబుల్స్లో తెలంగాణ షట్లర్ ఎన్.సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట 21-23, 8-21తో జాంగ్కోల్ఫాన్-రివిండా ద్వయం చేతిలో పరాజయం పాలైంది. స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ గైర్హాజరీలో మహిళల సింగిల్స్ బరిలోకి దిగిన మాళవిక 11-21, 14-21తో పొర్నపవీ చోచువాంగ్ చేతిలో ఓడగా.. మిక్స్డ్ డబుల్స్లో సాయిప్రణీత్-తనీషా జోడీ 13-21, 11-21తో డెచాపోల్-సప్సిరీ జంట చేతిలో పరాజయం పాలైంది. తదుపరి పోరులో సోమవారం డిఫెండింగ్ చాంపియన్ చైనాతో భారత్ తలపడనుంది.