ఔట్సోర్సింగ్, వీఆర్ఏ, హోంగార్డులకూ..
పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంపుపై సర్వత్రా హర్షం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిన్నంటిన సంబురాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
ఖమ్మం మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యోగ, ఉపాధ్యాయుల కల నెరవేరింది. తెలంగాణ ప్రభుత్వం వారికి తీపికబురు అందించింది.ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వరాల జల్లు కురిపించారు. పేరివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సు మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచారు. ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్వీట్లు పంచిపెట్టి, టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు మొక్కలు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డు, వీఆర్ఏ, ఆశావర్కర్లు, అంగన్వాడీలకూ పీఆర్సీ వర్తించనుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనతో ఉమ్మడి జిల్లాలో సుమారు 16 వేల మంది లబ్ధిపొందనున్నారు. మరో 10 వేల మందికి పైగా పదవీ విరమణ, ఫిట్మెంట్ ప్రయోజనాలు పొందనున్నారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఉపాధ్యాయు, ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామనీ, వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీలు నెరవేర్చారు. పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సు మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించడంపై ఉపాధ్యాయ, ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ సీఎం కేసీఆర్ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చి తమపై ప్రేమను చాటుకున్నారని వారు కొనియాడుతున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పీఆర్సీ ప్రకటిస్తారని ముందుగానే ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో కథనాలు రావడంతో ఉద్యోగ సంఘాల నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా ప్రకటన కోసం ఎదురుచూశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించారు. మరోవైపు శాఖల పరంగా పదోన్నతల ప్రక్రియ కూడా చేపడతామని, ఉద్యోగుల ఆరోగ్య స్కీంపై నూతన విధి విధానాలకు కమిటీ వేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబురాలు నిర్వహించారు.
ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకూ..
ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ విధులు నిర్వహించే చిరుద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు విద్యా వలంటీర్లు, సెర్ప్ ఉద్యోగులు, హోంగార్డుల వేతనాలను సైతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఉమ్మడి జిల్లాలో సుమారు 16 వేల మంది లబ్ధిపొందనున్నారు. మరో 10 వేల మందికి పైగా పదవీ విరమణ, ఫిట్మెంట్ ప్రయోజనాలు పొందనున్నారు. కస్తూర్బా, గురుకులాల్లో పనిచేస్తున్న మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలనే ప్రకటనపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు గెజిటెడ్ అధికారుల సంఘాలు, రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు మిఠాయిలు పంచుకుంటూ సంబురాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చారు. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యేలు సండ్ర, వనమా
హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను సీఎం కేసీఆర్ నెరువేరుస్తున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. పదవీ విరమణ వయస్సు పెంపు చారిత్రాత్మకమన్నారు.
విద్యాశాఖలో ఈ ఏడాదిలో 209 మందికి లబ్ధి
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 23 మంది ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు ఇద్దరు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు ఇద్దరు, ఎస్జీటీలు -08, స్కూల్ అసిస్టెంట్లు-11మంది ఉన్నారు. ఏప్రిల్లో మరో 21మంది, మే నెలలో-27 మంది, జూన్లో-45 మంది, జూలైలో 24మంది, ఆగస్టులో 21 మంది, సెప్టెంబర్లో 21 మంది, అక్టోబర్లో-10 మంది, నవంబర్లో తొమ్మిదిమంది, డిసెంబర్లో ఆరుగురు పదవీవిరమణ చేయనున్నారు. 2021లో ఇలా 209 మంది ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. పదవీ విరమణ వయస్సు 61 ఏళ్ల పెంపు నిర్ణయంతో ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది.