వ్యవసాయ యూనివర్సిటీ: ఎంతో మంది నిపుణులను తయారు చేసిన ఘనత వ్యవసాయ కళాశాలకు ఉన్నదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావు అన్నారు. కళాశాల 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆన్లైన్లో ఆయన సోమవారం మాట్లాడారు. అంతకు ముందు వ్యవసాయ కళాశాల ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాల లోగోను ఆన్లైన్లో ఆవిష్కరించారు. కొన్నేళ్ళ చరిత్ర కలిగిన వ్యవసాయ కళాశాల ఎంతో మంది వ్యవసాయ నిపుణులను అందించి, వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదం చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా ఆన్లైన్లోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయ శాత్రవేత్తల కృషి ఫలితంగా ఒకప్పుడు ‘షిప్ టూ మౌత్’ అన్న పరిస్థితి నుంచి సమృద్ధిగా ఆహార ధాన్యాలను పండిస్తున్న ఘనతలో కళాశాల కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిరంతర పరిశోధనలకు నిలయంగా కళాశాల మారిందని ప్రశంసించారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా కళాశాల విద్యను మెరుగుపరిచిందని కొనియాడారు. గడిచిన కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టడం వల్ల తెలంగాణ ‘రైస్ బౌల్ అఫ్ ఇండియా’గా మారిందని చెప్పారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా॥ నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ జగదీశ్వర్, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, పలువురు పూర్వ విద్యార్థులు, నిపుణులు, పాల్గొని పలు సూచనలు చేశారు.