షాబాద్, జూన్ 27: గ్రామాలు, పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టింది. జూలై 1వ తేదీ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, పల్లె ప్రగతిలో చేపట్టే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. నాలుగో విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నది.
జిల్లాలో 556 పంచాయతీల్లో..
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 556 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో జూలై 1 నుంచి 10వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో ముఖ్యంగా మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తారు. గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ లైన్మెన్, మిషన్ భగీరథ టెక్నీషియన్తో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. మొదటగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా రోడ్లు, మురుగుకాల్వలు, పాఠశాల లు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్సెంటర్లు శుభ్రం చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వకుండా మొరం పోయించనున్నారు. రోడ్లపైన, ఇతర స్థలాల్లో కలుపు మొక్కల తొలగింపు, తడి, పొడి చెత్త వేర్వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
గ్రామాల్లో ఎక్కడైనా వైకుంఠధామాలు, కంపోస్ట్యార్డుల నిర్మాణం పూర్తికాకుంటే వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. వినియోగంలో లేని బోరుబావులను పూడ్చి వేస్తారు. రైతువేదిక, కంపోస్ట్యార్డు, వైకుంఠధామాల చుట్టూ గ్రీన్ ఫెన్షింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఇంటా ఆరుమొక్కలు పెంచేలా అవగాహన కల్పించనున్నారు. గతేడాది హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎక్కడైనా చనిపోతే వాటి స్థానంలో కొత్తవి నాటాలి. పాఠశాలల చుట్టూ, అన్ని రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో విధిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. మండలానికి ఏదో ఒక చోట 10 ఎకరాల స్థలంలో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపడుతారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. ప్రతిరోజు చేసే పనులపై రోజువారీ నివేదికను కలెక్టర్ ఆధ్వర్యంలో సీఎస్కు సమర్పించనున్నారు.
మారుతున్న పల్లెలు, పట్టణాల రూపురేఖలు
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంతో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే మూడు విడుతల్లో గ్రామాలను పరిశుభ్రంగా మార్చా రు. పారిశుద్ధ్య స మస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు, పట్టణాల్లోని ఆయా కాలనీల్లో పర్యటించి సమస్యలు గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించనున్నారు.