భూసర్వేలో వెల్లడైన వాస్తవాలు
175 ఎకరాల్లో డిజిటల్ సర్వే
10 బృందాలతో విజిలెన్స్, ఏసీబీ, రెవెన్యూ అధికారుల విచారణ
మూడు సర్వే బృందాలు.. 10గంటలు
అచ్చంపేటలో భారీగా మోహరించిన పోలీసులు
మెదక్/వెల్దుర్తి/మనోహరాబాద్, మే 1: ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి కన్నేశాడని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 8గంటల నుంచి ఈటల రాజేందర్ భూ ఆక్రమణలపై మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో విచారణ చేపట్టారు. ఈ విచారణను విజిలెన్స్, ఏసీబీ, రెవెన్యూ అధికారులు మొదలు పెట్టారు. అచ్చంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో విజిలెన్స్ అధికారులు రెవెన్యూ అధికారులు బాధిత రైతులతో మాట్లాడారు. అసైన్డ్ భూములపై విజిలెన్స్, రెవెన్యూ అధికారులు లోతుగా విచారణ చేశారు.
సుమారు 10గంటల పాటు విచారణ
ఈటల రాజేందర్ భూ కబ్జాలపై మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో సుమారు 10 గంటలకు పైగా ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. బాధిత రైతుల నుంచి అన్ని వివరాలను సేకరించారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల వద్దకు బాధిత రైతులను తీసుకెళ్లి, పలువురు రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. అసైన్డ్ భూ కబ్జాలపై అడుగడుగునా లోతుగా వెళ్లి రైతుల నుంచి వివరాలను సేకరించారు. రైతుల వద్ద ఉన్న హక్కు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలో విజిలెన్స్ ఎస్పీ మనోహర్, సీఐ సతీష్రెడ్డి, ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ కబ్జాపై విచారణ చేపట్టడానికి అచ్చంపేట గ్రామానికి వచ్చినట్లు చెప్పారు. విజిలెన్స్, ఏసీబీ అధికారులతో పది బృందాలను ఏర్పాటు చేసి భూ కబ్జాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన రైతులతో పాటు గ్రామంలోని ఇతర బాధిత రైతులను, విచారణకు అవసరమైన వారందరినీ విచారించినట్లు చెప్పారు.
మూడు డీజీపీఎస్ బృందాలతో భూసర్వే..
ఈటల రాజేందర్ భార్య జమున హేచరీస్ శివారులో ఉన్న అసైన్డ్ భూములను మూడు డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(డీజీపీఎస్) సర్వే బృందాలు సర్వే చేశాయి. ముందుగా జమున హేచరీస్ చుట్టు పక్కల, సమీపంలోని ఫీడ్ మిల్లు, గోదాముల వద్ద సర్వే నిర్వహించారు. ఆ తర్వాత జమున హేచరీస్ చుట్టు పక్కల ప్రాంతం నుంచి అసైన్డ్ భూముల వద్ద వరకు వెళ్లి సర్వే చేశారు. అచ్చంపేట శివారులోని 130లో 15.35 ఎకరాలు, 111లో 7.15 ఎకరాలు, 81 సర్వే నంబర్లో 9.18 ఎకరాలుండగా, మంత్రి ఈటల రాజేందర్ సుమారు వంద ఎకరాల్లో భూ కబ్జా చేసినట్టు ఆరోపణలున్నాయి. శనివారం జరిపిన రెవెన్యూ అధికారుల సర్వేలో మొత్తం 65 ఎకరాల భూమి కబ్జాకు గురైందని తేలింది. అయితే మొత్తంగా అచ్చంపేట శివారులో 175 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం తెలిసింది.
అచ్చంపేటలో భారీగా పోలీసుల మోహరింపు..
ఈటల రాజేందర్ భార్య జమున హేచరీస్ భూ కబ్జాతో మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో భారీగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ఎస్పీ చందనదీప్తి, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్, 10మంది సీఐలు, 25మంది ఎస్సైలు, 200కు పైగా సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. అచ్చంపేట నుంచి మాసాయిపేట రహదారి వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లా, ఇతర జిల్లాల పోలీసులు అచ్చంపేట గ్రామంలో పికెట్ నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చేపట్టారు. అచ్చంపేట శివారులో ఓ టెంటు వేసుకొని పోలీసు బృందాలు మోహరించాయి.
విచారణపై విజిలెన్స్ డీజీ ఆరా
మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఈటల రాజేందర్ భూ కబ్జాపై జరుగుతున్న విచారణను శనివారం సాయంత్రం విజిలెన్స్ డీజీ పూర్ణచందర్రావు ఆరా తీశారు. విచారణను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.