లండన్: బ్రిటన్లో కరోనా వైరస్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు .. ఆస్ట్రాజెనికా కంపెనీతో కలిసి కోవిడ్ టీకాను అభివృద్ధి చేశారు. అయితే సోమవారం లండన్లో వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ప్రారంభమైంది. కరోనా ఆంక్షలు పాటిస్తూ స్వల్ప స్థాయిలో ఆ టోర్నీకి ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. ఇక సెంటర్ కోర్టులోని రాయల్ బాక్సులో ప్రత్యేక ఆహ్వానితులు దర్శనమిచ్చారు. కోవిడ్ టీకా అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ తమ టీమ్తో కలిసి టెన్నిస్ మ్యాచ్ను వీక్షించారు. వ్యాక్సిన్ను అభివృద్ధి చేసి మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేలా చేసిన ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలతో పాటు నేషనల్ హెల్త్ సర్వీస్ బృందానికి కూడా వింబుల్డన్ థ్యాంక్స్ చెప్పింది. కరోనా మహహ్మారి వేళ ఎన్హెచ్ఎస్ సేవలు చిరస్మరణీయమని వింబుల్డన్ అనౌన్సర్ ప్రకటించారు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు అంతా కరతాళధ్వనులతో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన మెడికల్ స్టాఫ్తో పాటు క్రిటికల్ కేర్, నర్సింగ్ స్టాఫ్, వర్కర్లకు వింబుల్డన్ థ్యాంక్స్ తెలిపింది. ఇక కరోనా వేళ భారీ విరాళం సేకరించిన కెప్టెన్ సర్ టామ్ మూర్ను కూడా గుర్తు చేసుకున్నారు. ఎన్హెచ్ఎస్ కోసం టామ్ మూర్ పిలుపుతో సుమారు 33 మిలియన్ల పౌండ్ల విరాళం వచ్చింది. వందేళ్ల ఆ వృద్ధుడు ఆ తర్వాత కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే.