అబుదాబి: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక సూపర్-12లోకి దూసుకెళ్లింది. గెలిస్తే తప్ప నిలువని పరిస్థితుల్లో ఐర్లాండ్తో మ్యాచ్లో సత్తాచాటింది. బుధవారం ఐర్లాండ్తో జరిగిన ఏకపక్ష పోరులో లంక 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న లంకేయులు గ్రూపు-ఎలో టాప్లో కొనసాగుతున్నారు. మొదట వహిందు హసరంగ (47 బంతుల్లో 71, 10ఫోర్లు, సిక్స్), నిస్సంకా(47 బంతుల్లో 61, 6ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో లంక నిర్ణీత 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు కుశాల్ పెరెరా(0), చండిమల్(6), ఫెర్నాండో(0) కోల్పోయిన దశలో హసరంగ, నిస్సంకా జట్టును ఆదుకున్నారు. ఐర్లాండ్ బౌలింగ్ను సమర్థంగా నిలువరిస్తూ క్రీజులో కుదురుకున్నారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ వీలైనప్పుడల్లా సింగిల్స్ తీస్తూ కీలక పరుగులు జత చేశారు. అయితే అదైర్ బౌలింగ్లో హసరంగ ఔట్ కావడంతో నాలుగో వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖర్లో దసున్ షనక(21 నాటౌట్) దూకుడు కనబర్చడంతో లంక భారీ స్కోరు అందుకుంది. జోష్ లిటిల్(4/23) నాలుగు వికెట్లతో విజృంభించాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్..లంక బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ అండీ బాల్బిర్ని(41) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. తిక్షణ(3/17), కరుణరత్నె, లహిరు రెండేసి వికెట్లు తీశారు. అర్ధసెంచరీతో పాటు వికెట్ తీసిన హసరంగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. మరోవైపు నెదర్లాండ్స్పై నమీబియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. డేవిడ్ వీస్(60 నాటౌట్) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు.