న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ను కష్టాలు ఇప్పట్లో వీడేలా లేవు. వరుస ఓటములు, బోర్డు, ప్లేయర్స్కు మధ్య వివాదాలకు తోడు ఇప్పుడు ఆ టీమ్ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంధనం లీక్ కావడంతో ఇండియాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ విషయాన్ని ఆ టీమ్ కోచ్ మిక్కీ ఆర్థర్ వెల్లడించాడు. ఇంగ్లండ్ టూర్ ముగించుకొని తిరిగి స్వదేశానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానంలో ఇంధన సమస్యలు తలెత్తడంతో ఇండియాలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఆర్థర్ చెప్పాడు. విమానంలో ఇంధనం లీక్ కావడంతో మమ్మల్ని ఇండియాకు మళ్లించారు. అక్కడ దిగగామనే నా ఫోన్ స్విచాన్ చేశాను. ఇంగ్లండ్ ఆపరేషనల్ మేనేజర్ నుంచి రెండు మెసేజ్లు ఉన్నాయి. ఆయనే ఈ పరిస్థితిని మాకు వివరించాడు. కానీ ఆ సమయంలో కాస్త ఆందోళనకు గురయ్యామని ఆర్థర్ చెప్పాడు.
స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా ఆ టీమ్ సభ్యులు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ఫలితాల కోసం ఆతృతగా ఎదురు చూశారు. అంతకుముందే ఇంగ్లండ్ టీమ్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడంతో లంక క్రికెటర్లు కూడా ఆందోళన చెందారు. వచ్చే వారం (జులై 13) నుంచి ఇండియాతో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది శ్రీలంక. ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఇండియన్ టీమ్ శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే.