కొలంబో: శ్రీలంక క్రికెట్ టీమ్.. ఒకప్పుడు వరల్డ్ చాంపియన్స్. ఓ చిన్న దేశం కొన్నాళ్ల పాటు ప్రపంచ క్రికెట్ను శాసించింది. కానీ ఇప్పుడా టీమ్ పరిస్థితి దారుణంగా మారింది. కొన్నేళ్ల కిందటి వరకూ టీమంతా స్టార్లతో నిండిన లంకలో ఇప్పుడు ఒక్క చెప్పుకోదగిన ప్లేయరూ లేడు. దీంతో వరుస ఓటములు వెక్కిరిస్తున్నాయి. అయినా అభిమానులు మాత్రం తమ టీమ్కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఓటమిని మాత్రం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సౌథాంప్టన్లో జరిగిన మూడో టీ20లో 89 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్.. సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.
శ్రీలంకకు ఇది వరుసగా ఐదో టీ20 సిరీస్ ఓటమి. దీంతో అభిమానుల సహనం నశించింది. టీమ్లో పదే పదే విఫలమవుతున్న ప్లేయర్స్కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో క్రికెటర్లను అన్ఫాలో కావాలన్నదే ఈ ప్రచారం ఉద్దేశం. ఆదివారం మొత్తం #unfollowcricketers హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. వేల మంది అభిమానులు వైస్ కెప్టెన్ కుశల్ మెండిస్, ఓపెనర్ ధనుష్క గుణతిలక ఫేస్బుక్ పేజీలను అన్ఫాలో చేశారు.
ఇక నుంచి శ్రీలంక టీమ్ ఆడుతుంటే టీవీలు చూడొద్దనీ అభిమానులు పిలుపునిచ్చారు. నేషనల్ టీమ్లో సరిగా ఆడని వాళ్లకు సోషల్ మీడియాలో ప్రచారం అవసరం లేదని వాళ్లు అంటున్నారు. ఇంగ్లండ్లో ఈ ఓటమి గత మూడు దశాబ్దాలలో శ్రీలంక క్రికెట్ టీమ్ ఎన్నడూ చూడనిదని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రచారంపై క్రికెటర్లు ఇప్పటి వరకూ ఏమీ స్పందించలేదు.