కొలంబో: క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ నిర్వహించి.. కోట్లు వెనకేసుకుంది. నష్టాల్లో కూరుకుపోయిన అక్కడి క్రికెట్ బోర్డు.. ఈ సిరీస్తో మళ్లీ లాభాల బాట పట్టింది. బోర్డు సెక్రటరీ మోహన్ డిసిల్వా చెప్పిన దాని ప్రకారం.. ఈ సిరీస్తో శ్రీలంక బోర్డుకు రూ.107.7 కోట్లు వచ్చాయి. నిజానికి మొదట కేవలం మూడు వన్డేల సిరీస్ మాత్రమే జరగాల్సింది.
అయితే అక్కడి బోర్డు మన బీసీసీఐని అభ్యర్థించి మరో మూడు టీ20ల సిరీస్ ఆడటానికి ఒప్పించింది. ఇది ఆర్థికంగా అక్కడి బోర్డుకు బాగా కలిసి వచ్చింది. బ్రాడ్కాస్టింగ్, ఇతర స్పాన్సర్షిప్స్తో ఈ భారీ మొత్తం తమకు దక్కినట్లు మోహన్ డిసిల్వా చెప్పారు. ఈ సిరీస్ కోసం వచ్చి, విజయవంతం చేసినందుకు కోచ్ ద్రవిడ్, టీమిండియాకు శ్రీలంక కృతజ్ఞతలు తెలిపింది. ఈ టూర్లో వన్డే సిరీస్ టీమిండియా గెలవగా.. టీ20 సిరీస్ను శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే.