హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యంతరం తెలిపారు. ఈటల తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. వామపక్షవాదిగా, లౌకికవాదిగా చెప్పుకొన్న ఈటల బీజేపీ కండువా కప్పుకోవడాన్ని తప్పు పట్టారు. వామపక్ష పార్టీలపై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వీడియో సందేశంలో తమ్మినేని ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని, బీజేపీ మతోన్మాదాన్ని పెంచుతూ హింసను ప్రేరేపిస్తున్నదని మండిపడ్డారు. అలాంటి పార్టీలో చేరేందుకు ఈటలకు మనసెలా వచ్చిందని ప్రశ్నించారు.