హైదరాబాద్: ఐపీఎల్లో కఠినమైన బయో బబుల్ను ఛేదించుకొని కరోనా వైరస్ లోనికి చొరబడింది. ప్లేయర్స్తోపాటు సహాయ సిబ్బందికి కూడా సోకింది. అసలు వైరస్ ఎలా వచ్చిందో చెప్పడం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా అన్నాడు. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా అదే అంటున్నాడు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా వృద్ధిమాన్ సాహాకు కరోనా ఎలా సోకిందో అంతుబట్టడం లేదని అతను అన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు రాసిన తన కాలమ్లో లక్ష్మణ్ దీనిపై స్పందించాడు.
సన్రైజర్స్ టీమ్ యాజమాన్యం కూడా ఇప్పటికీ అదే షాక్లో ఉన్నదని లక్ష్మణ్ వెల్లడించాడు. ఇంత కఠినమైన బబుల్ను కూడా ఛేదించి వచ్చిందంటే కరోనాపై పోరులో ఇది మనకో పాఠంలాంటిదని అతడు అభిప్రాయపడ్డాడు. ఒక సిటీ నుంచి మరో సిటీ వెళ్తున్నప్పుడు కూడా ఐపీఎల్ ప్రొటోకాల్స్ పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉండేది. కానీ కేకేఆర్, సీఎస్కే క్యాంప్లలో పాజిటివ్ కేసులు వచ్చాయని తెలియగానే మాలో సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందే మేము వాళ్లతో మ్యాచ్ ఆడాము. ఆ టీమ్లోని కొందరితో సన్నిహితంగా ఉన్నాము. దీంతో మాలోనూ ఆందోళన కనిపించింది. అయితే టెస్టుల్లో నెగటివ్గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నాం అని లక్ష్మణ్ చెప్పాడు.
అయితే తర్వాత రెండు రోజులకే వృద్ధిమాన్ సాహా పాజిటివ్గా తేలాడు. గత బుధవారం అతడు చెన్నైతో మ్యాచ్ ఆడాడు. సాహా ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ ఆడాల్సి ఉండింది. అయితే అంతకుముందే అతడు కాస్త అనారోగ్యంగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచాం. కానీ అనుకోకుండా అతనికి కరోనా సోకినట్లు తేలింది. ఇప్పటికీ మాకు ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు.