హైదరాబాద్: భారత క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. జ్యుయెలరీ డిజైనర్, మార్కెటింగ్ స్పెషలిస్టు, తన చిన్ననాటి స్నేహితురాలు అయిన నటషాను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ నూతన దంపతులకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సందీప్, అతని భార్య నటషాల పెండ్లి ఫొటోను షేర్ చేస్తూ.. ”ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీకి పెండ్లికళ వచ్చింది. కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ శర్మ. మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం” అని ట్వీట్ చేసింది.
ఆ ట్వీట్పై ఎస్ఆర్హెచ్ టీమ్ సభ్యుడు, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశాడు. కంగ్రాట్స్ యూ గైస్. మిస్ యూ అని కామెంట్ పెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు కూడా ట్విటర్ వేదికగా సందీప్ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా సందీప్ శర్మ, నటషాలకు 2018 లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే, కరోనా కారణంగా పెండ్లిని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మహమ్మారి ప్రభావం తగ్గడంతో పెండ్లి చేసుకున్నారు.
ఇక, సందీప్ శర్మ 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన సందీప్ శర్మ 110 వికెట్లు తీశాడు. 2013 నుంచి 2017 వరకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు ఆడిన సందీప్ 2018 నుంచి సన్రైజర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదిలావుంటే జూలై 17, 2015లో జింబాబ్వేతో జరిగిన T20 మ్యాచ్ ద్వారా సందీప్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.