సభ్యత్వదారులకు పార్టీ భరోసా
ఇంటిపెద్ద కోల్పోయిన కుటుంబాలకు బాసట
నాలుగేండ్ల నుంచి ఇన్సూరెన్స్ అమలు
ప్రమాదవశాత్తూ చనిపోతే 2లక్షల సాయం
ఉమ్మడి జిల్లాలో 220 కుటుంబాలకు సొమ్ము
ఇప్పటి వరకు 4.40కోట్ల చెల్లింపులు
పెద్దపల్లి, మార్చి 24(నమస్తే తెలంగాణ): కార్యకర్త అంటే.. జెండాలు మోసీ జేజేలు కొట్టే బానిసలుగా.. ఎన్నికలొస్తే ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి, ప్రచారం చేసి, కరపత్రాలు పంచే ఏజెంట్లుగా.. తమ రాజకీయ బల నిరూపణకు జనసమీకరణ చేసి ర్యాలీలు, నిరసనలు చేసే ప్రతిఫలకారులుగా పలు పార్టీలు చూస్తున్న ఈ రోజుల్లో.. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ మాత్రం శ్రేణులను కడుపులో పెట్టి చూసుకుంటున్నది. కార్యకర్తలే శ్రీరామ రక్షగా భావిస్తూ కష్టసుఖాల్లో తోడుగా ఉంటున్నది. ఏ పార్టీలో లేని విధంగా.. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమాను వర్తింప జేస్తున్నది. క్రియాశీలక, సాధారణ సభ్యత్వదారులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. నాలుగేళ్లుగా ప్రమాదబీమాను అమలు చేస్తూ 2లక్షల సాయం చేస్తున్నది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 220 కుటుంబాలకు సొమ్ము అందించి, భరోసా ఇచ్చింది.
స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యాన్ని చేరుకుంది. 14 ఏళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత రాష్ర్టాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, ఆరున్నరేండ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణకు బాటలు వేసింది. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసి దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలుపడమేకాదు పార్టీకి జై కొట్టి జెండాను భుజాన మోసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోడుగా నిలుస్తున్నారు. కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడమేకాదు కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా 2017 నుంచి 2లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఆపత్కాలంలో కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
సభ్యత్వదారులందరికీ సాయం..
పార్టీ సాధారణ, క్రియాశీలక సభ్యత్వదారులందరికీ సాయం చేస్తున్నారు. రెండేళ్ల కొకసారి డ్రైవ్ చేపట్టి సభ్యత్వం చేయిస్తున్నారు. క్రియాశీల 100, సాధారణ సభ్యత్వానికి 50 రుసుం చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారందరికీ ప్రమాదబీమాను కల్పిస్తున్నారు. ఈ మేరకు కార్యకర్తలపై పార్టీ గ్రూప్ ఇన్సూరెన్స్లు చేయించి, ఎక్కడ ఏ నాయకుడు, కార్యకర్త ప్రమాదవశాత్తు మృతి చెందినా వారి కుటుంబాలు ఆగంకాకుండా ప్రమాద బీమా సొమ్మును చెక్కు రూపంలో అందిస్తున్నారు. నాలుగేళ్లుగా పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తూ భరోసా ఇస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు 220 మంది మృతిచెందగా, ఇప్పటి వరకు 4.40కోట్లు చెల్లింపులు చేశారు. నేరుగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు బాధితుల ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి చెక్కులను అందిస్తున్నారు.
బాధితులకు భరోసా..
దేశంలో ఎక్కడా.. ఏ పార్టీలో లేనివిధంగా కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమాను వర్తింపజేస్తున్నది. ఆపద సమయాల్లో బాధితులకు కొండంత ధైర్యం ఇస్తున్నది. మంత్రులు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సదరు కార్యకర్త, నాయకుడి కుటుంబాల ఇండ్లకు వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. ఇంటి పెద్ద లేని లోటు పూడ్చలేనిదే అయినా భరోసా ఇస్తున్నారు. బీమా చెక్కులు అందజేస్తున్నారు. ఫలితంగా బాధితులు పార్టీకి, కేసీఆర్కు, కేటీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.