సాగర్లో టీఆర్ఎస్ విజయం ఖాయం
‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : ‘నాగార్జునసాగర్ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. జానారెడ్డీ… ఇక చాలూ అన్న భావనతో ఉన్నారు. మాకు సాగర్ అభివృద్ధే కావాలి… రికార్డులు వద్దని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన లభిస్తుంది. హుజూర్నగర్ ఉప ఎన్నిక, ఇటీవలి శాసనమండలి ఎన్నికల్లో మాదిరిగానే ఇక్కడా విజయాల పరంపర కొనసాగిస్తాం. సాగర్లో నోముల భగత్ను గెలిపించుకుని మరోసారి ఇక్కడ గులాబీ జెండా ఎగురవేస్తాం’ అని సాగర్ ఉప ఎన్నికల ఇన్చార్జీల్లో ఒకరైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలను పంచుకున్నారు.
నమస్తే : ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది?
పల్లా : ఎన్నికల ప్రచార వ్యూహంలో సక్సెస్ అయ్యాం. మిగతా ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో ప్రచారాన్ని నిర్వహించాం. మా అభ్యర్థి నోముల భగత్ ప్రతి గ్రామాన్ని టచ్ చేశారు. పార్టీ కార్యకర్తలు గ్రామంలోని ప్రతి గడపను తట్టారు. ప్రతి వర్గాన్ని కూడా కలిశారు. ఒక్కో ఇంటిని కనీసం నాలుగైదు సార్లు, కొన్ని చోట్ల పదిసార్లు కూడా చేరుకున్నాం. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాం. ఇప్పటివరకు ఏమేం చేస్తున్నామో చెబుతూ, ఇంకా చేయాల్సింది ఏం ఉన్నదో ప్రజల నుంచే అడిగి తెలుసుకున్నాం. తక్షణమే చేయాల్సిన వాటిల్లో కొన్నింటికి పరిష్కార మార్గాన్ని చూపించగలిగాం. అందుకే ఏ పల్లెకు వెళ్లినా మహిళలు హారతులతో, యువత కేరింతలతో స్వాగతం పలికారు. రైతులు సాదరంగా స్వాగతించారు. వృద్ధులు, దివ్యాంగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ ప్రచారంలో కలిసి వచ్చారు. కారు గుర్తుకే ఓటేస్తామని కొన్ని చోట్ల సామూహికంగా ముందుకు వచ్చారు.
నమస్తే : కాంగ్రెస్ నేతల వైఖరి, ప్రచారమే వద్దన్న జానా తీరును ఎలా చూస్తారు?
పల్లా : కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, అత్యధిక కాలం మంత్రిగా చేశానని వ్యక్తిగత ప్రతిష్టలు తప్ప.. సాగర్ ప్రజల కోసం చేసిందేమీ లేదనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. అందుకే ప్రజల్లోకి వెళ్లాలంటే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి వెనుకంజ వేస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రచారమే వద్దని అనడం ఓటమిని అంగీకరించినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రచారంలో అభివృద్ధి గురించి చెప్పలేక వ్యక్తిగత దూషణలకు తెరలేపారు. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల మీద అసత్యాలు, అభూతకల్పనతో మాట్లాడారు. ఇక్కడా అదే మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రచారంలో ఎక్కడా కూడా అలాంటి వాటికి చోటివ్వలేదు. కేవలం చేసింది చెప్పాం. చేయబోయేది వివరించాం. సంస్కారం లేని కాంగ్రెస్ నేతలకు సాగర్ ప్రజలు బుద్ధి చెప్తారు.
నమస్తే : కేసీఆర్ సభను అడ్డుకోవడానికి కూడా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారా?
పల్లా : టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వస్తున్న స్పందనతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారు. ఇక కేసీఆర్ సభ జరిగితే పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న భయంలో ఉన్నారు. ఎలాగైనా సభను అడ్డుకోవాలన్న కుట్రలకు తెరలేపారు. సభను నిలిపివేయాలంటూ జానారెడ్డి తన దగ్గరి బంధువులతో కోర్టులో కేసులు వేయించారు. ఇదేనా ఆయన పెద్దరికం? ఎన్నికల ప్రజాస్వామ్యంలో సభలు పెట్టి ఏం చేస్తామో చెప్పుకోవడం పార్టీల వ్యూహాల్లో ఒక భాగం. ఇలాంటి దాన్ని కూడా సహించలేని దుస్థితికి జానారెడ్డి దిగజారడం సరికాదు.
నమస్తే : ఎన్నికల ఫలితాలు, మీ అంచనాలు ఎలా ఉన్నాయి?
పల్లా : 2018 ఎన్నికల్లోనే జానారెడ్డిని ప్రజలు తిరస్కరించారు. ఆయన స్థానంలో అభివృద్ధి కోసం నోముల నర్సింహయ్యను గెలిపించారు. దురదృష్టవశాత్తు ఆయన మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ప్రజల స్పందన చూస్తుంటే నర్సింహయ్య కుమారుడు భగత్ విజయం ఎప్పుడో ఖాయమైంది. ప్రచారం ముందుకు సాగుతున్నా కొద్దీ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలుపొందాం. ఇటీవలి శాసన మండలి ఎన్నికల్లోనూ భారీ విజయాన్ని సాధించాం. అదే రకమైన విజయాల పరంపరను సాగర్ ఉప ఎన్నికల్లోనూ కొనసాగిస్తాం. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు.
ఇవి కూడా చదవండి
కరోనా కేసుల్లో బ్రెజిల్ను దాటిన భారత్.. వరల్డ్లో సెకండ్ ప్లేస్
మమతా బెనర్జీపై 24 గంటల ప్రచార నిషేధం
మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు