న్యూఢిల్లీ: మూడు సార్లు పారాలింపిక్స్ పతక విజేత దేవేంద్ర ఝఝారియాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడా అవార్డుల కమిటీలో ఆయన సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ప్రకటించిన కమిటీకి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ముకందకం శర్మ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో దేవేంద్ర ఝఝారియాతో పాటు మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, భారత మహిళల మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, షూటర్ అంజలి భగవత్, మాజీ బాక్సర్ సరితా దేవి కూడా సభ్యులుగా ఉన్నారు. త్వరలోనే ఈ కమిటీ బేటీ అయి విజేతలను నిర్ణయించనుంది. ఈ ఏడాది క్రీడా అవార్డులను ఇప్పటికే ప్రకటించాల్సి ఉండగా.. టోక్యో పారాలింపిక్స్ నేపథ్యంలో వాటిని వాయిదావేసిన విషయం తెలిసిందే.
పారా విజేతలకు క్రీడాశాఖ సన్మానం
టోక్యో పారాలింపిక్స్లో పతకాలు సాధించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన పారా క్రీడాకారులను కేంద్ర క్రీడాశాఖ బుధవారం ఢిల్లీలో ఘనంగా సన్మానించింది. 19 పతకాలు సాధించిన 17 మంది విజేతలకు (అవని, సింగరాజ్లకు రెండు పతకాలు) కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.