న్యూఢిల్లీ: క్రీడల్లో అత్యున్నత అవార్డు ఖేల్రత్న పేరును రాజీవ్ ఖేల్రత్న నుంచి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుగా మార్చిన విషయం తెలుసు కదా. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్లో ప్రధాని మోదీ వెల్లడించారు. ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ గెలిచి, వుమెన్స్ టీమ్ తృటిలో ఆ మెడల్ను చేజార్చుకున్న వేళ మోదీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. తన తండ్రి ధ్యాన్చంద్( Dhyan Chand )కు భారతరత్న ఇవ్వాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న ఈ హాకీ లెజెండ్ కుమారుడు అశోక్ కుమార్.. ఖేల్రత్న అవార్డు పేరు మార్పును స్వాగతించారు.
అంతేకాదు స్పోర్ట్స్ అవార్డులకు స్పోర్ట్స్ వాళ్ల పేర్లే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశారు. ఇది దానికి ఆరంభం అని అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ధ్యాన్చంద్ మొత్తం దేశానికి చెందినవాడు. ఈ అవార్డుకు మొదట రాజీవ్గాంధీ పేరు పెట్టారు. కానీ స్పోర్ట్స్ అవార్డులకు స్పోర్ట్స్ వాళ్ల పేర్లు పెడితేనే బాగుంటుంది. మొత్తానికి మన దేశం, ప్రధాని దీనిని గుర్తించారు. హాకీకి పెరిగిపోతున్న ఆదరణ నేపథ్యంలో అత్యున్నత అవార్డుకు ధ్యాన్చంద్ పేరు పెట్టడం సంతోషంగా ఉంది అని అశోక్ కుమార్ అన్నారు.
ధ్యాన్చంద్ ఆల్టైమ్ గ్రేటెస్ట్ హాకీ ప్లేయర్స్లో ఒకడు. ఇండియన్ హాకీ టీమ్ సాధించిన తొలి మూడు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్లో ధ్యాన్చంద్ పాత్రే కీలకం. 1928, 1932, 1936 ఒలింపిక్స్లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించినప్పుడు ధ్యాన్చందే కీలకపాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉంది. ఇప్పటికే ఆయన జయంతి (ఆగస్ట్ 29) రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుండగా.. ఇప్పుడు క్రీడల్లో అత్యున్నత పురస్కారం ఖేల్రత్నకు కూడా ఆయన పేరు పెట్టడం స్పోర్ట్స్ లవర్స్లో ఆనందం నింపుతోంది.