సుల్తాన్బజార్, జూలై 1: పేదల ధర్మాసుపత్రిగా పేర్గాంచి, వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖాన మూడు ప్రపంచ స్థాయి రికార్డులను తన పేర లికించుకుంది. ఈ మేరకు గురువారం జాతీయ దినోత్సవ వేడుకల కార్యక్రమం జరిగింది. దవాఖాన ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి లయన్ కేవీ రమణారావు, దక్షిణ భారత ప్రతినిధి శ్రీవిద్య, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి రాజులు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్కు వరల్డ్స్ రికార్డు, భారత్ వరల్డ్స్ రికార్డ్స్, డాక్టర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా లయన్ కేవీ రమణారావు మాట్లాడుతూ వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖానలో వందలాది మంది వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించి ‘ఉస్మానియా’ కీర్తి, ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు రోగుల ప్రాణాలను కాపాడి వారి కుటుంబ సభ్యుల మన్నలను పొందారు. ప్రపంచానికి అనస్తీషియా (మత్తు మందు)ను పరిచయం చేసిన ఘనత ఉస్మానియా దవాఖానకే దక్కుతుందన్నారు.
కొవిడ్ విపత్కర పరిస్థితిలో గాంధీ, కింగ్ కోఠిలను కొవిడ్ కేంద్రాలుగా మార్చడంతో ఆయా దవాఖానాలకు వెళ్ళే సాధారణ రోగులంతా ఉస్మానియాకే రావడంతో వారికి మెరుగైన వైద్య సేవలందించడంలో విశేషంగా కృషి చేసి ప్రాణాలను నిలబెట్టారన్నారు. కిడ్నీ, లివర్, అవయవ మార్పిడి విజయవంతంగా నిర్వహించడంతో పాటు 700లకు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లను నిర్వహించి రెండు తెలుగు రాష్ర్టాలలో ఆసుపత్రి అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
అంతే కాకుండా త్వరలోనే హార్ట్, లంగ్స్ అవయవ మార్పిడిలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండటం శుభపరిణామమన్నారు. వారం రోజులుగా ఉస్మానియా దవాఖానను సందర్శించి ప్రపంచ రికార్డు ప్రతినిధులకు అన్నింటిని సేకరించి మూడు ప్రపంచ రికార్డులను అందించడం ఎంతో ఆనందంగా ఉందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంవోలు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
యేడాదిగా కొవిడ్ విపత్కర సమయంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని, వైద్యులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ అన్నారు. ఈ మేరకు గురువారం కోఠి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందించిన పలువురికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కనిపించే దేవుళ్ళు వైద్యులన్నారు.
కొవిడ్ విపత్కర సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఎంతో అభినందనీయమన్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యుల సేవలు అభినందనీయమన్నారు. విపత్కర సమయంలో విధులు నిర్వర్తించిన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయంలో విశేష సేవలందించిన టీఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీతో పాటు పలువురు వైద్యులకు ఘనంగా సన్మా నం చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర కోశాధికారి గట్టు శ్రీనివాసులు, ఐఎంఏ నగర శాఖ అధ్యక్షుడు డాక్టర్లు సి.సాయిరాం, పి.పవన్ కుమార్, జయరాజ్ జానకి పాల్గొన్నారు.
కనిపించని దైవాన్ని నిత్యం పూజిస్తే, కనిపించే దేవుళ్లయిన వైద్యులను నిరంతరం కాపాడుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320బీ జిల్లా గవర్నర్ విద్యాసాగర్రెడ్డి అన్నారు. కోఠి ఈఎన్టీ దవాఖానలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥ తాటి శంకర్, హెచ్వోడీ డా॥ ఎల్.సుదర్శన్రెడ్డి, ప్రొ॥ మనీష్ కుమార్ గుప్త, డా॥ సంపత్ కుమార్ సింగ్, డా॥ ఆనందాచార్య, ఆర్ఎంవో డా॥ జయ మనోహరితో పాటు ఇతర వై ద్యులను సన్మానించారు. విద్యాసాగర్రెడ్డి మాట్లాడుతూ, బ్లాక్ ఫంగస్ బారిన రోగులకు భరోసా కల్పించి వారి ప్రాణాలను కాపాడటంలో ఈఎన్టీ వైద్యులు చేసిన కృషి అభినందనీయమన్నారు. దవాఖాన సూపరింటెండెంట్ శంకర్ మాట్లాడుతూ, దవాఖాన వైద్యులు, వైద్య సిబ్బంది కృషితో నెల రోజుల వ్యవధిలో సుమారు 700 మందికి పైగా బ్లాక్ ఫంగస్ రోగులను కాపాడాగలిగామన్నారు.