న్యూఢిల్లీ: మేరీకోమ్తో సహా 30 మంది ఇతర భారతీయ బాక్సింగ్ క్రీడాకారులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానం శనివారం తెల్లవారుజామున అత్యవసరంగా దుబాయి విమానాశ్రయంలో ల్యాండైంది. ఫ్యూయల్ ఎమర్జెన్సీ వల్లే ల్యాండయినట్లు స్పైస్ జెట్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తిగా కేంద్ర పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది. దాదాపు 45 నిమిషాల పాటు దుబాయి విమానాశ్రయంలోనే విమానం నిలిచిపోయింది.
కరోనా ఆంక్షల మధ్య ఈ నెల 24వ తేదీ నుంచి దోహాలో జరిగే ఆసియన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ టోర్నీకి భారతీయ బాక్సర్లను ప్రత్యేక అనుమతితో స్పైస్ జెట్ విమానం వెళ్లేందుకు బయలుదేరింది. వచ్చేనెల ఒకటో తేదీ వరకు చాంపియన్ షిప్ టోర్నీ జరుగుతుంది. ఈ విమానంలో 31 మంది బాక్సర్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ఢిల్లీ ఎయిర్పోర్టులో శనివారం తెల్లవారుజామున 2.20 గంటలకు ఈ విమానం బయలుదేరింది. ఉదయం 6.20 గంటలకు దుబాయి విమానాశ్రయంలో ల్యాండయింది.
ఫ్యూయల్ ఎమర్జెన్సీ అని పేర్కొనడంతో విమానాశ్రయంలో దిగేందుకు అనుమతించిన యూఏఈ అధికారుల్లో కొంత గందరగోళం నెలకొనడంతో 45 నిమిషాల పాటు విమానం నిలిచిపోయింది. కరోనా రెండో వేవ్ నేపథ్యంలో గత నెల 25 నుంచి భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులను యూఏఈ నిషేధించింది.