క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో సెంచరీ కొడితే వచ్చే ఆ కిక్కే వేరు. క్రికెట్కు పుట్టినిల్లుగా పేరొందిన లార్డ్స్లో సెంచరీ కొట్టి ఆనర్స్ బోర్డులో పేరు ఎక్కితే చాలు జన్మ ధన్యమైనట్లే అనుకొనే క్రికెటర్లు కోకొల్లలు. కానీ భారత్ నుంచి ఈ ఘనత అందుకున్నది కొద్ది మందే. ఇందులో వినూ మన్కడ్ నుంచి మొదలుపెడితే తాజాగా సూపర్ సెంచరీతో టీమ్ఇండియాకు భారీ స్కోరు అందించిన కేఎల్ రాహుల్ వరకు పది మంది ఉన్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇప్పటికే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాహుల్..టెస్టులపై తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్తో లార్డ్స్ టెస్టులో సెంచరీ చేసిన రాహుల్.. మరో వెర్షన్ను అభిమానులకు పరిచయం చేసింది. టెస్టు జట్టులోకి వస్తూ పోతున్న ఈ కర్ణాటక హిట్టర్ క్లాసిక్ సెంచరీతో దిగ్గజాల సరసన నిలిచాడు. ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని సమర్థంగా నిలువరిస్తూ తన పాత్రకు న్యాయం చేశాడు. గిల్, మయాంక్ గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాహుల్పై ప్రత్యేక కథనం.
కేఎల్ రాహుల్..ఫార్మాట్ ఏదైనా ప్రతాపం చూపించే బ్యాట్స్మన్. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజం, ఆత్మవిశ్వాసంతో కనిపించే రాహుల్.. లార్డ్స్ టెస్టుతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. రెగ్యులర్ ఓపెనర్ శుభమన్ గిల్ గాయంతో పూర్తిగా దూరం కాగా, మయాంక్ అగర్వాల్ తల గాయంతో అందుబాటులో లేకుండా పోయాడు. ఇలా తనకు దక్కిన అవకాశాన్ని రాహుల్ అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. హిట్మ్యాన్ రోహిత్శర్మతో కలిసి ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొన్నాడు. చెత్త షాట్లకు పోకుండా బౌలర్లను గౌరవిస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా చూడచక్కని బౌండరీలతో అభిమానులను అలరించాడు. లార్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓ ఎండ్లో రోహిత్శర్మ దూకుడు కనబరిస్తే..రాహుల్ మాత్రం తన శైలికి భిన్నంగా క్రీజులో కుదురుకునేందుకు మొగ్గుచూపాడు. పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చాక బ్యాటు ఝులిపించిన ఈ కన్నడ డైనమైట్..తన కెరీర్లో ఆరో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో సెంచరీ చేయడం ద్వారా వినూ మన్కడ్, గుండప్ప విశ్వనాథ్, దిలీప్ వెంగ్సర్కార్, రవిశాస్త్రి, మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, అగర్కార్, రాహుల్ ద్రవిడ్, రహానే తర్వాత పదో భారత క్రికెటర్గా రాహుల్.. ఆనర్స్ బోర్డులో పేరు దక్కించుకున్నాడు. ‘బోర్డులో నా పేరు చేర్చుతారా లేదా అని ప్రతి రోజు ఉదయం అటుగా చూస్తుండే వాన్ని. ఒకవేళ చేర్చినా..శాశ్వతంగా ఉంచుతారా లేక తాత్కాలికంగానే పరిమితం చేస్తారా అన్న సందేహం ఉండేది’ అని మ్యాచ్ ముగిసిన రాహుల్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.
రాహుల్ నయా వెర్షన్:
రాహుల్ ఆట..లార్డ్స్ టెస్టుకు ముందు ఆ తర్వాత అన్నట్లు కనిపిస్తున్నది. ఇంగ్లండ్ గడ్డపై చివరిసారి మూడేండ్ల క్రితం జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆడిన రాహుల్..చివరి టెస్టు ఓవల్లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయిన రాహుల్…ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెడుతూ పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ కొనసాగించాడు. ఆఫ్స్టంప్పై ఊరించే బంతులను అంతే చాకచక్యంగా వదిలిపెడుతూ..అద్భుత క్రికెటింగ్ షాట్లతో రాహుల్ ఆడిన ఆట విమర్శకుల ప్రశంసలు పొందింది. సెంచరీ మార్క్ అందుకోగానే తనదైన శైలిలో బ్యాటుతో అభివాదం చేసిన రాహుల్..ఓపెనింగ్ బెర్తుకు మరింత పోటీ తీసుకొచ్చాడనే చెప్పాలి. ఇప్పటికే గిల్, మయాంక్, రోహిత్శర్మ, పృథ్వీషా రూపంలో ఓపెనింగ్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో రాహుల్ ఫామ్ మరింత రంజుగా మార్చింది. మిగిలిన మూడు టెస్టుల్లోనూ కేఎల్ ఇదే ఫామ్ కొనసాగిస్తే..కోహ్లీసేన కొత్త చరిత్ర లిఖించడం ఖాయం.
టెస్టుల్లో 19వ ర్యాంక్
లార్డ్స్ టెస్టులో భారత్కు అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన భారత ఓపెనింగ్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ తమ టెస్టు ర్యాంకింగులను మెరుగుపర్చుకున్నారు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో.. రాహుల్ 19 స్థానాలు ఎగబాకి 37వ (గతవారం 56వ ర్యాంకు) ర్యాంక్కు చేరుకున్నాడు. లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో రాహుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండో ర్యాంక్కు చేరాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో ర్యాంక్లో ఉన్నాడు. ఇక బౌలింగ్లో.. లార్డ్స్లో ఎనిమిది వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసిన హైదరాబాదీ స్పీడ్స్టర్ సిరాజ్.. 18 స్థానాలు పైకి ఎగబాకి 38వ ర్యాంకుకు చేరాడు. ఈ జాబితాలో ప్యాట్ కమిన్స్ అగ్రస్థానం నిలబెట్టుకోగా బూమ్రా 10వ ర్యాంకులో ఉన్నాడు.