సౌథాంప్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు పేస్, బౌన్స్కు అనుకూలించే పిచ్ తయారవుతోంది. రెండు టీమ్స్కు ఇది న్యూట్రల్ వేదిక కావడంతో ఐసీసీ సూచనల మేరకు పిచ్ తయారు చేస్తున్నట్లు ఇక్కడి క్యూరేటర్ సైమన్ లీ చెప్పాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వన్డే క్రికెట్ గ్రౌండ్స్మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మూడుసార్లు అందుకున్న సైమన్ లీ.. ఈసారి పిచ్ తయారీ కాస్త సులువైందని అన్నాడు. ఐసీసీ సూచనల మేరకే పిచ్ తయారు చేస్తుండటంతో తన పని సులువైందని చెప్పాడు.
అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్మెన్కు అనుకూలించే పిచ్తో మ్యాచ్ రసవత్తరంగా సాగేలా పిచ్ను తయారు చేస్తున్నట్లు తెలిపాడు. అయితే తాను వ్యక్తిగతంగా పిచ్ పేస్, బౌన్స్కు అనుకూలించేలా తయారు చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లండ్లో ఎండలు ఎక్కువగా ఉండటంతో పిచ్ను ఎక్కువగా రోలింగ్ చేయకుండానే గట్టిగా ఉన్నట్లు సైమన్ తెలిపాడు. దీనివల్ల పేస్, బౌన్స్ సహజంగానే వస్తాయని అన్నాడు. ఒకవేళ ఎండ తగ్గి, పిచ్ పొడిగా మారిపోతే స్పిన్కు కూడా అనుకూలించే అవకాశం ఉన్నట్లు చెప్పాడు. ఈ నెల 18 నుంచి ఫైనల్ ప్రారంభమవుతుంది.