హైదరాబాద్ : మన రాష్ర్టంలో పేద వర్గాలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందుతుందని జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. శాసనసభలో వైద్యారోగ్య శాఖ పద్దులపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు 17 వేల బెడ్లు ఉంటే.. వాటి స్థాయిని 23 వేలకు పెంచారని తెలిపారు. రాష్ర్టం ఏర్పడే నాటికి నాలుగు ఐసీయూలు ఉండగా.. వాటికి అదనంగా 25 ఏర్పాటు చేసి మొత్తాన్ని 29కి తీసుకొచ్చారు.
ప్రతి జిల్లా కేంద్రంతో పాటు ఇతర ఆస్పత్రుల్లో అదనంగా 46 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. డయాలసిస్ సెంటర్లలో క్వాలిటీ వైద్యం అందిస్తున్నారు. ఈ సెంటర్ల ఏర్పాటుతో కిడ్నీ రోగులకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు. రాష్ర్టంలో మరిన్ని డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ర్టంలో డయాగ్నోస్టిక్ సెంటర్ హబ్స్ను ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు. చాలా ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సెంటర్లలో మంచి మిషనరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ను ఆరోగ్యశ్రీలో చేర్చడం పేదలకు ఎంతో వెసులుబాటు కలిగిందన్నారు.
9,888 బెడ్లకు ఆక్సిజన్ అందేలా ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు 100 ఉన్న వెంటిలేటర్ బెడ్లను 1300లకు పెంచారు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎక్స్పీరియన్స్ టీచర్లను అందుబాటులో ఉంచారన్నారు. కేసీఆర్ కిట్కు దేశ వ్యాప్తంగా ఆదరణ లభించిందన్నారు. ఈ పథకం ద్వారా శిశు మరణాల రేటు తగ్గిందన్నారు. మగబిడ్డ పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్బిణీ స్ర్తీలు డెలివరీ అయిన తర్వాత అమ్మ ఒడి వాహనాల్లో ఇంటికి చేర్చుతున్నామని ఎమ్మెల్యే సంజయ్య తెలిపారు.