బ్రిస్టల్: ఆల్రౌండర్ స్నేహ్ రాణా (154 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) అద్భుత పోరాటం చేయడంతో ఇంగ్లండ్తో ఏకైక టెస్టును భారత మహిళల జట్టు డ్రా చేసుకుంది. ఏడేండ్ల తర్వాత టెస్టు బరిలోకి దిగిన టీమ్ఇండియా ఫాలోఆన్లో కష్టాల్లో ఉన్న సమయంలో స్నేహ్, తానియా భాటియా (88 బంతుల్లో 44 నాటౌట్) ఆదుకున్నారు. దీంతో శనివారం ఆఖరి రోజు ఆటను 8 వికెట్లకు 344 పరుగుల వద్ద భారత్ ముగించింది. ఓవర్నైట్ స్కోరు 83/1 శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఆరంభంలోనే షఫాలీ వర్మ (63) వికెట్ కోల్పోయింది. ఈ దశలో దీప్తి శర్మ (54), పూనమ్ రౌత్ (39) రాణించడంతో పరిస్థితులు చక్కబడ్డాయి. అయితే ఆ తర్వాత వారితో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్ప్రీత్ కౌర్ (8), పూజా వస్ర్తాకర్ (12) పెవిలియన్కు వరుసకట్టడంతో 189 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి అంచుల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో శిఖా పాండే (18), తానియా సాయంతో పోరాడిన స్నేహ్ భారత్ను గట్టెక్కించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లెస్టోన్ నాలుగు వికెట్లు తీసింది. రెండు ఇన్నింగ్స్లో అర్ధశతకాలతో రాణించిన భారత యువ సంచలనం షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.