ఆశాజనకంగా వర్షపాతం
ఖమ్మం రూరల్ పరిధిలోని చెరువుల్లోకి నీరు
ఆకేరు, మున్నేరుపై చెక్డ్యాంలకు జలకళ
ఖమ్మం రూరల్, జూలై 11: పెద్ద ప్రాజెక్టులతో పాటు చిన్న నీటి వనరులను సంరక్షించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చెక్డ్యాం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. దీనిలో భాగంగా రూరల్ మండల పరిధిలోని మున్నేరు, ఆకేరుతో పాటు వాగుల వద్ద చెక్డ్యాంలు ఏర్పడ్డాయి. దీంతో సాగునీటి సమస్యలకు పరిష్కారం దొరికింది. మరోవైపు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో మండలంలో చెరువుల పునరుద్ధరణ కూడా పూర్తి కావడంతో చెరువుల్లోకి నీరు చేరుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి. వానలు ఇలాగే కురిస్తే రెండు, మూడు రోజుల్లో మత్తడి పోసే అవకాశం కనిపిస్తున్నది.
పెరుగుతున్న భూగర్భజలాలు..
మండలంలోని ఆకేరుపై కస్నాతండా వద్ద ఒకటి, కాచిరాజుగూడెం వద్ద రెండు, తీర్థాల వద్ద గత ఏడాది నిర్మించిన చెక్డ్యాంలు రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో పొంగిపొర్లుతున్నాయి. దీంతో చెక్ డ్యాంల పరిధిలోని 1,650 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. దండిగా భూగర్భ జలాలు ఉండడంతో పంటలు పండుతాయి. ఏడాది పొడవునా చెక్డ్యాంల వద్ద నీరు నిల్వ ఉండటంతో నీటికి కొదువ లేదని, కాచిరాజుగూడెం, ఎం.వెంకటాయపాలెం, గూడురుపాడు, గుండాల తండాలో భూగర్భజలాలు పెరిగాయని రైతులు తెలుపుతున్నారు. మత్స్య సంపదకూ కొదువ లేదని మత్స్యకారులు వెల్లడిస్తున్నారు.
ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది..
చిన్న నీటి వనరులను కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. ఖమ్మం రూరల్ మండలంలో ఇప్పటికే మూడు చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో చెక్ డ్యాం నిర్మాణం జరుగుతున్నది. మరో నెలలో మిగిలిన పనులు పూర్తవుతాయి. చెక్డ్యాంల నిర్మాణంతో సాగునీరు పుష్కలంగా అందుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. పంటలకు సమృద్ధిగా నీరు అందుతుంది. ప్రభుత్వం చిన్న నీటి వనరులను కాపాడుతున్నది.
ఇవి కూడా చదవండి..
చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తాం
టీబీజీకేఎస్తోనే హక్కుల పరిరక్షణ