కరోనా రోగులకు కావాల్సిన మందులు, మూడు పూటలా పౌష్టికాహారం అందించాలి
బాధ్యతతో పనులు చేస్తూ ఆస్పత్రిని శుభ్రంగా ఉంచాలి
వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు
తాండూరు, మే 18: కరోనా రోగులకు ఐసొలేషన్ కేంద్రాలతో మెరుగైన సేవలు అందించవచ్చని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని మాతా శిశు విభాగంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ చంద్రయ్య, ప్రత్యేక అధికారి హన్మంతరావు, ఆర్డీవో అశోక్ కుమార్తో కలిసి ఆమె పరిశీలించారు. ఐసొలేషన్ వార్డులో సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న చికిత్సలు, ఆహారం, సిబ్బంది పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సమీపంలో ఉన్న అపరిశుభ్రతను చూసి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రి లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. కరోనా పరీక్షల కిట్స్తో పాటు కావాల్సి మందులు, ఆక్సిజన్ను ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. మూడు పూటలా పౌష్టికాహారంతో పాటు రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యసిబ్బంది శ్రద్ధ వహించాలన్నారు. పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పౌసుమి బసు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రజలు కొవిడ్ బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న జ్వర సర్వేలో జిల్లా, మండల అధికారులు పాల్గొని పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పెంచాలని, కరోనా లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందజేయాలని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు.