సిద్దిపేట అర్బన్, మే 07 : మీ వార్డు ప్రజలకు మీరు తల్లిదండ్రుల లాంటి వారని, ప్రజల అవసరాలు తెలుసుకొని వాటిని తీర్చడంలో ముందుండాలని నూతనంగా ఎన్నికైన సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో నూతన టీఆర్ఎస్ కౌన్సిలర్లతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ సారి 36 మంది కొత్తగా కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారని, అందులో సగం మంది యువకులే ఉన్నారన్నారు. యువకులు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని, వార్డులో ప్రజలకు అవసరమయ్యే కొత్త ప్రయత్నాలు చేయాలన్నారు. మీ వార్డుల్లోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తేనే, ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. మీ మీద పోటీచేసిన వారిని కూడా మిత్రులుగా చూడాలని, శత్రుత్వంతో చూడకూడదన్నారు. తద్వారా మన వార్డుకు మంచి జరుగుతుందన్నారు. ఇక్కడి నాయకులకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అన్నారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.